Pawan Kalyan : గోదావరి తీరం.. ఆధ్యాత్మిక హారం.. పవన్ సృశించిన మణిహారం

620 కి.మీల పరిధిలో రెండు గోదావరి జిల్లాల పరిధిలో ఉన్న ప్రతి పవిత్ర ఆలయాన్ని కలుపుతూ ఆధ్యాత్మికంగా పర్యాటకంగా ఈ జిల్లాలను అభివృద్ధి చేయడానికి పవన్ కళ్యాణ్ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు

Written By: NARESH, Updated On : June 26, 2023 9:49 pm
Follow us on

Pawan Kalyan : అధికారంలోకి వస్తే ఏం చేయగలమో.. ఇప్పుడు వైసీపీ ఏం చేయడంలేదో చాలా చక్కగా ఉదాహరణలతో సహా వివరించాడు మన పవన్ కళ్యాణ్. పశ్చిమ గోదావరి జిల్లాలోకి వారాహి యాత్ర ఎంట్రీ సందర్భంగా గోదావరి జిల్లాల మాస్టర్ ప్లాన్ ను పవన్ ప్రకటించారు. గోదావరి జిల్లాల్లో ఉన్న ఆధ్యాత్మిక ఆలయాలు, పవిత్రక్షేత్రాలను హారంగా చేయడమే లక్ష్యమని ప్రకటించారు.

అన్నవరం సత్యదేవుడి క్షేత్రం నుంచి భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం వరకూ ఎన్నో పవిత్ర క్షేత్రాలు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి. వేదఘోషతో పరవశించే గోదావరి ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ గా తీర్చిదిద్దడానికి పవన్ సంకల్పించారు. శక్తి పీఠాలు కొలువైన పిఠాపురం, ద్రాక్షారామం.. పంచారామ క్షేత్రలైన సామార్లకోట, పాలకొల్లు, నవ నారసింహా క్షేత్రాల్లో ఒకటైన అంతర్వేది, ర్యాలీ జగన్మోహిని స్వామి క్షేత్రం, అయినవిల్లి వినాయక ఆలయం, శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన వాడపల్లి, ద్వారకా తిరుమల క్షేత్రాలు, నరసాపురం శ్రీ ఎంబేరు మన్నారు స్వామి ఆలయం.. ఇలా ఒకటేమిటీ ఎన్నెన్నో దివ్యక్షేత్రాలతో గోదావరి సీమ అలరారుతోంది.

620 కి.మీల పరిధిలో రెండు గోదావరి జిల్లాల పరిధిలో ఉన్న ప్రతి పవిత్ర ఆలయాన్ని కలుపుతూ ఆధ్యాత్మికంగా పర్యాటకంగా ఈ జిల్లాలను అభివృద్ధి చేయడానికి పవన్ కళ్యాణ్ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. అధికారంలోకి వస్తే దీన్ని నెరవేరుస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చారు.

ఈ విధమైన ఆధ్యాత్మిక పర్యటక అభివృద్ధి మూలంగా ఇక్కడి సనాతన ధర్మ విశిష్టత నలుచెరుగులా వ్యాప్తి చేయడమే కాదు ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయడమే జనసేన సత్సంకల్పానికి ముఖ్య కారణంగా పవన్ అభివర్ణించారు. ఆధ్యాత్మిక హారంగా ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ప్రకటించారు.