Pawan Kalyan Health Updates: ఏపీ క్యాబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. కీలక అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర నీరసంతో కళ్ళు తిరిగిన లక్షణాలతో కనిపించారు. వెంటనే సీఎం చంద్రబాబు అనుమతితో మంత్రివర్గ సమావేశం నుంచి బయటకు వచ్చేసారు. గత రెండు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయినా క్షణం తీరిక లేకుండా ఉండడంతో అస్వస్థతకు గురయ్యారు. అయితే అనారోగ్య సమస్యలు ఉన్నా మంత్రివర్గ సమావేశాన్ని కీలకంగా భావించి ఆయన హాజరయ్యారు. కానీ కాస్త తీవ్ర అస్వస్థత ఎదురు కావడంతో మంత్రివర్గ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. పవన్ అనారోగ్యానికి గురయ్యారని తెలుసుకొని జనసైనికులు ఆందోళనకు గురయ్యారు.
రోజు వారి కార్యక్రమాలతో బిజీ..
గత కొద్దిరోజులుగా పాలనాపరమైన అంశాలతో పాటు రాజకీయంగా బిజీ అయ్యారు పవన్ కళ్యాణ్. హైదరాబాదులో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అటు నుంచి వచ్చి అమరావతిలో తన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో డీహైడ్రేషన్కు గురయ్యారు. ఆయనకు బీపీ హెచ్చు తగ్గులు కారణంగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తన పరిస్థితిని సీఎం చంద్రబాబుకు వివరించడంతో ఆయన అనుమతి మేరకు మంత్రివర్గ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు..
అధికారిక కార్యక్రమాలు రద్దు..
క్యాబినెట్ భేటీలో అస్వస్థతకు గురి కావడంతో పవన్ నేరుగా తన నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయన వ్యక్తిగత వైద్య బృందం పరీక్షలు చేపట్టింది. డిహైడ్రేషన్ మూలంగానే అలా జరిగిందని నిర్ధారించింది. పవన్ కళ్యాణ్ కు వెంటనే సెలైన్ బాటిల్ కూడా పెట్టారు. అయితే పవన్ అస్వస్థత విషయం తెలుసుకున్న జనసైనికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదం ఏదీ లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరో రెండు మూడు రోజులపాటు పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని విశ్రాంతి తీసుకుంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
