Pawan Kalyan: ఇప్పుడంటే జగన్ గులాబీ పార్టీకి దగ్గర మిత్రుడు అయిపోయాడు. 2024లో జరిగే ఎన్నికల్లో ఏపీలో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని కెసిఆర్ కూడా చెప్పారు. అక్కడిదాకా ఎందుకు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆ కార్యక్రమానికి కేసీఆర్ కూడా వెళ్లారు. ఆయనను ప్రగతి భవన్ కు ఆహ్వానించారు. అప్పట్లో కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి జగన్ ను కెసిఆర్ ఆహ్వానించారు.
జగన్ మీడియాలో కేసీఆర్ గురించి.. కెసిఆర్ మీడియాలో జగన్ గురించి ఒక్క నెగిటివ్ వార్త కూడా రాదు. పైగా ఆ మధ్య బెంగళూరులో కేటీఆర్.. జగన్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కలుసుకున్నారు. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో కూడా గులాబీ పార్టీకి వైసిపి.. వైసీపీకి గులాబీ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ సహకరిస్తుంటాయి. పైగా ఒకరి ఫీడ్ మరొకరు షేర్ చేసుకుంటారు. సయామి కవలల మాదిరిగా సాగిపోతున్న గులాబీ పార్టీ, వైసిపి బంధానికి పవన్ కళ్యాణ్ తెలంగాణ గడ్డ మీద నుంచి గట్టి షాక్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ ను ఆంధ్ర నేత అంటూ నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని మంగళవారం పబ్లిష్ చేసింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఔత్సాహికులు పవన్ కళ్యాణ్.. కేటీఆర్ గతంలో దిగిన ఫోటోలను.. వారిద్దరూ మాట్లాడుకుంటున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో గులాబీ పార్టీ మీడియా అసలు రంగు బయటపడింది. ఇక పవన్ కళ్యాణ్ తన ఇంటి వద్ద నుంచి జరిగిన విలేకరుల సమావేశంలో ఆవేశంగా మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణ విషయంలో వైఎస్ఆర్ పోషించిన పాత్ర గురించి స్పష్టంగా చెప్పేశారు. ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ గురించి గులాబీ మీడియా.. గులాబీ పార్టీ నాయకులు సానుకూలంగా మాట్లాడుతున్నారు. అంతకుముందు కేసీఆర్ కూడా వైఎస్ఆర్ గురించి గొప్పగానే మాట్లాడారు. తెలంగాణకు బద్ధ శత్రువు వైఎస్ఆర్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
వైయస్ బతికున్నప్పుడు చాలామంది తెలంగాణవాదులు నోరు మెదపలేదని.. నాడు తెలంగాణని వ్యతిరేకించిన వాళ్లంతా ఇప్పుడు పదవుల్లో ఉన్నారని.. వైయస్సార్ బతికి ఉన్నప్పుడు వారంతా తెలంగాణ నినాదాన్ని కూడా సహించేవారు కాదని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్ మీద విష ప్రచారం చేస్తున్న వైసీపీకి.. వైసిపి మీడియాకు జనసేన అధినేత షాకిచ్చారు. తెలంగాణ ఉద్యమం సాగుతున్నప్పుడు వైయస్సార్ ఎలా వ్యవహరించారు.. ఎలా ఉద్యమాన్ని తొక్కిపెట్టారు అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గట్టిగానే ఉదహరించారు.. దీంతో వైసీపీ నేతలకు షాక్ తగిలింది. అంతేకాదు ఇటీవల ఓ వైసీపీ ఎమ్మెల్యే చేసిన భూ కుంభకోణం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో ఏదో హంగామా చేద్దామని అనుకున్న వైసీపీ మీడియాకు.. వైసిపి నాయకులకు ఆదిలోనే బ్రేక్ వేశారు పవన్ కళ్యాణ్. అదే కాదు తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్న నమస్తే తెలంగాణకు కూడా దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.
