Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనసేనలో పెద్ద ఎత్తున చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వివిధ పార్టీల్లో ఉన్న సీనియర్లతో పాటు నమ్మకస్తులైన నేతలను, మంచి పేరున్న నేతలను, సమాజం పై ప్రభావం చూపే తటస్థులను పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ చేరికలకు గాను 14 మంది పార్టీ నేతలతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటివరకు చేరికల విషయంలో జనసేన అధినేత పెద్దగా ఆసక్తి కనబరచలేదు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు చేరికల విషయంలో నిర్ణయం తీసుకోవడం చూస్తుంటే గట్టి వ్యూహం ఉన్నట్లు అర్థం అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది.
* అప్పట్లో ఆసక్తి చూపలే…
2024 ఎన్నికల కు ముందు వివిధ పార్టీల నేతలు జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఎంపిక చేసుకున్న నేతలను పార్టీలోకి రప్పించి టికెట్లు ఇచ్చారు.. అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధ ప్రసాద్, నిమ్మక జయ కృష్ణ లాంటి వారిని అలానే రప్పించి టికెట్లు ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు వచ్చారు. కిలారు రోశయ్యతో పాటు సామినేని ఉదయభాను వంటి నేతలు జనసేనలోకి వచ్చారు. అంతకుమించి పెద్దగా నేతలు కనిపించలేదు. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం చేరికల విషయంలో కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు జనసేన. కానీ ఇప్పుడు చేరికల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చింది నాయకత్వం. దాని వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు అర్థమవుతోంది. ఒకటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం, రెండు తటస్తులను చేర్చుకోవడం ద్వారా బలపడటం. ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదగకుండా చేయడం. ఈ వ్యూహంతోనే జనసేన చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.
* 14 మందితో కమిటీ..
జనసేన జాయినింగ్స్ కమిటీని 14 మంది నేతలతో ఏర్పాటు చేశారు అధినేత పవన్ కళ్యాణ్. ముగ్గురు ఎంపీలకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు. ఎమ్మెల్యేలతో పాటు యాక్టివ్ గా ఉన్న నాయకులను ఈ కమిటీలో స్థానం కల్పించారు. దీంతో చేరికలు పెరిగే అవకాశం ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కాస్త క్లీన్ ఇమేజ్ ఉన్నవారు, వివిధ రంగాల ప్రముఖులను జనసేనలోకి రప్పించే వ్యూహం ఇది అని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు నియోజకవర్గాల పునర్విభజన దృష్టిలో పెట్టుకొని.. తగినంతమంది సమర్థవంతమైన నాయకులను సిద్ధం చేయాలన్నది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. మొత్తానికైతే పవన్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనమే.
