Pawan Kalyan: ఏపీ ( Andhra Pradesh) రాజకీయాలు విచిత్రంగా మారుతున్నాయి. కూటమి మధ్య రోజు రోజుకు బంధం బలపడుతోంది. కూటమిలో విచ్ఛిన్నం రానిదే వైసిపికి ఛాన్స్ లేదన్నట్టు పరిస్థితి ఉంది. విజయసాయి రెడ్డి లాంటి రాజకీయాలు తెలిసిన వ్యక్తి కూడా దీనిని తేల్చేశారు. కూటమి ఉన్నంతవరకు జగన్ అధికారంలోకి రారని కూడా తేల్చి చెప్పారు. తనకు మళ్ళీ అవకాశం ఇస్తే కూటమిలో విచ్చిన్నానికి ప్రయత్నిస్తాను అన్నట్టు ఆయన మాట్లాడారు. కానీ విజయసాయి రెడ్డి అవసరం లేదు. తమ పార్టీ నేతలు చాలు అన్నట్టు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఎలాగూ చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ విడిపోరు. ఆ రెండు పార్టీలతో కలిసి వెళుతుంది బిజెపి. అందుకే ఇప్పుడు కొత్త ఆలోచన చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. కాపులతో రాజకీయం చేయడం ద్వారా… పవన్ కళ్యాణ్ ను బలహీనపరచడం ద్వారా.. కూటమి బలం తగ్గించవచ్చు అన్న ఆలోచన చేస్తున్నారు.
* ఆ ప్రయత్నంలో వైసీపీ కాపు నేతలు..
అంబటి రాంబాబును( ambati Rambabu) ఇప్పుడు కాపు నాయకుడిగా ప్రాజెక్ట్ చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. దీని వెనుక కాపు వ్యూహం ఉంది. టిడిపి తో జనసేన కలిసి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గెలవలేరు.. వారు విడిపోవాలని అనుకోవడం లేదు. ఏం చేసినా విడిపోయే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ ను బలహీనం చేయాలి. అలా చేయాలంటే కాపుల ఆలోచన మారాలి. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంతో కాపులకు వైరుధ్యం వచ్చేలా చేయాలి. అందులో భాగంగానే అంబటి రాంబాబు తిట్ల దండకం అని విశ్లేషణలు కూడా ఉన్నాయి. చంద్రబాబును తిట్టడం ద్వారా కమ్మ సామాజిక వర్గం వారికి కోపం రావాలి. వారి నుంచి వచ్చే విమర్శలతో కాపు సామాజిక వర్గంలో ఆగ్రహం తేవాలి. తద్వారా కాపులు కూటమి నుంచి టర్న్ కావాలి.
* ఆ ఆలోచనతోనే..
పవన్ కళ్యాణ్ ( AP deputy CM Pawan Kalyan) వెంట మెజారిటీ కాపులు ఉన్నారు అన్నది జగన్ అంచనా. పవన్ కళ్యాణ్ నుంచి కాపులను దూరం చేస్తే తన రాజకీయానికి సులువు అవుతుందని జగన్మోహన్ రెడ్డి బలంగా విశ్వసిస్తున్నారు. ఆపై కూటమి పార్టీలో ఛాన్స్ లేక వైసీపీలో కొనసాగుతున్న కాపు నేతలకు మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. అందుకే అంబటి ఎపిసోడ్ ద్వారా పవన్ కళ్యాణ్ నుంచి కాపులను దూరం చేసేందుకు వైసీపీ కాపు నేతలు కూడా పాల్గొన్నారు. తమ పాత్ర పోషిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలహీనం చేయడం అంటే తమను తాను బలహీనం చేసుకోవడం అని కాపులు నమ్మినంతకాలం వీరి డ్రామాలు చెల్లకపోవచ్చు.
