Pawan Kalyan Amit Shah Meeting: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి ఇంతలా దిగజారుతారా? ఆయన వెళ్లి అమిత్ షాను జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టమని కోరుతారా? రాజకీయంగా ఎదుర్కొంటారు తప్ప ఇటువంటి పరిస్థితికి వస్తారా? అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ ఎందుకు అలా వచ్చింది? ఆయనకు ఎవరు సమాచారం ఇచ్చారు? పొలిటికల్ వర్గాల్లో దీనిపైన చర్చ నడుస్తోంది. కొద్దిరోజుల కిందట హోం మంత్రి అమిత్ షాను పవన్ కళ్యాణ్ కలిసినట్లు.. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టమని కోరినట్టు.. అందుకు అమిత్ షా తిరస్కరించినట్టు.. జగన్ శాశ్వత మిత్రుడు అన్నట్టు.. చంద్రబాబు తాత్కాలిక స్నేహితుడు అన్నట్టు.. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్లొద్దు అంటూ సలహా ఇచ్చినట్టు.. చంద్రబాబు కోసం మనమెందుకు పని చేయాలి అన్నట్టు.. ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషించారు. ఈ సమావేశంలో నాదేండ్ల మనోహర్ ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చారు. తనకు విశ్వసనీయ సమాచారం అన్నట్టు మాట్లాడారు. అది మొదలు ఏపీలో రచ్చ రచ్చ సాగుతోంది. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చారు నాదెండ్ల మనోహర్. అటువంటిదేమీ లేదని తేల్చేశారు.
* ఎప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగానే…
ప్రొఫెసర్ నాగేశ్వరరావు మంచి విశ్లేషకుడు. కానీ ఆయన ఎప్పుడూ చంద్రబాబుకు వ్యతిరేకి. ఆ విశ్లేషణలో చంద్రబాబు వ్యతిరేక ముద్ర కనిపిస్తుంది. ఇప్పుడు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను పంపినట్టు.. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టమని పవన్ మధ్యవర్తిత్వం వహించారన్నది ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ. అంతవరకు ఓకే. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయం చేస్తారే అనుకుందాం. అయితే జైల్లో పెట్టమని తానే స్వయంగా అడుగుతారు కదా. పోనీ చంద్రబాబు చెప్పారు సరే.. పవన్ అలా వెళ్లి అమిత్ షాను కోరుతారా? 2014లో కేంద్రంలో బిజెపికి మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్. జగన్ వస్తే విధ్వంసం పుట్టుకొస్తుందని చెప్పి అప్పట్లో రాష్ట్రంలో టిడిపికి.. కేంద్రంలో బిజెపికి మద్దతు తెలిపారు. 67 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు. అధికార పక్షానికి ధీటుగా వ్యవహరిస్తున్నారు. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా కేంద్ర పెద్దలను కలవలేదు. కేవలం రాజకీయంగానే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొన్నారు తప్ప.. వ్యక్తిగతంగా ఆయనపై ఫిర్యాదులు చేసిన దాఖలాలు లేవు. అప్పుడే చేయని పవన్ ఇప్పుడు ఎలా చేస్తారు అనేది ఒక ప్రశ్న.
* కోర్టులను ప్రభావితం చేయగలరా?
అయినా జగన్మోహన్ రెడ్డి పై ఉన్నవి పాత కేసులు. ఏవైనా కొత్త కేసులు పెట్టి జైల్లో పెట్టాలని కోరుతారే తప్ప.. పాత కేసులు కోర్టుల పరిధిలో ఉన్నాయి. ఆ కేసుల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రమేయం ఏమి ఉంటుంది. కోర్టులను మోదీ, అమిత్ షా ఆదేశాలు జారీ చేయగలరా? ప్రభుత్వాలు కోర్టులను ప్రభావితం చేయగలవు అనుకుంటే.. ఒక్కోసారి ప్రతికూల తీర్పులు ఎలా వస్తున్నాయి. అయితే ఒకటి మాత్రం నిజం అయి ఉంటుంది. ఇందులో నాదేండ్ల మనోహర్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి.. ఆయనంటే గిట్టని వారు సమాచారం ఇవ్వొచ్చు. లేకుంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు ఎవరైనా పక్కదారి పట్టించవచ్చు. లేకుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ టిడిపి పై వ్యతిరేకతతో.. కూటమిలో చిన్నపాటి కుదుపు తెచ్చేందుకు ఈ విశ్లేషణ చేసి ఉండవచ్చు. అంతకుమించి ఏమీ కనిపించడం లేదు కూడా. అయితే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో అందరి అనుమానం ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైనే ఉంది.
