Deputy CM Pavan Kalyan : పవన్ కు అనారోగ్యం.. క్యాబినెట్ భేటీకి గైర్హాజరు.. ప్రస్తుతం ఉన్నది అక్కడే!

నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. దీంతో రకరకాలుగా ప్రచారం సాగింది. కానీ ఆయన ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన అక్కడ చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

Written By: Dharma, Updated On : October 11, 2024 5:41 pm

Deputy CM Pavan Kalyan

Follow us on

Deputy CM Pavan Kalyan :  పవన్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ తరచు అనారోగ్యానికి గురికావడం పరిపాటిగా వస్తుంది. ప్రతి నెల రోజులకు పవన్ అనారోగ్యం పాడిన పడ్డారన్న వార్త బయటకు వస్తోంది. కొద్ది రోజుల కిందట ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ తిరుమలలో అనారోగ్యానికి గురయ్యారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స కూడా పొందారు. అటు తరువాత పవన్ ఆరోగ్యం పై ఎటువంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని… హైదరాబాదులో చికిత్స పొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. చివరి రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరిలోని మెట్ల మార్గం గుండా కాలినడకన వెళ్లి స్వామి వారిని దర్శించుకోగలిగారు. అప్పట్లోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. అతి కష్టం మీద నడవగలిగారు. జ్వరం బారిన పడటంతో అటు తరువాత సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించి డిక్లరేషన్ సభలో పాల్గొంటారా? లేదా? అన్న అనుమానం కూడా వెంటాడింది. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కావడంతో ఆ సమావేశంలో పాల్గొన్నారు. కానీ అటు తరువాత పవన్ హెల్త్ పై ఎటువంటి అప్డేట్ లేదు. అయితే నిన్నటి మంత్రివర్గ సమావేశానికి పవన్ గైర్హాజరయ్యారు. దీంతో పవన్ అనారోగ్యానికి గురయ్యారన్న విషయం వెలుగులోకి వచ్చింది.

* కొద్దిరోజుల పాటు హైదరాబాదులోనే
ప్రస్తుతం పవన్ హైదరాబాదులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అక్కడే వైద్య సేవలు పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. కొద్దిరోజుల పాటు అక్కడే ఉంటారని తెలుస్తోంది కూడా. అయితే గత పది నెలలుగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. తొలుత ఎన్నికల ప్రచారం, కూటమి పార్టీలతో సమన్వయంతో క్షణం తీరిక లేకుండా గడిపారు. మధ్యలో వారాహి బహిరంగ సభల్లో పాల్గొనేవారు. ఈ క్రమంలో తరచు అనారోగ్యానికి గురయ్యేవారు.

* ప్రజాక్షేత్రంలో ఇబ్బందులే
వాస్తవానికి పవన్ కళ్యాణ్ సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ప్రజా జీవితంలోకి వచ్చాక ఒక సామాన్య ప్రజాప్రతినిధిగా గడుపుతున్నారు. సినీ రంగంలో అయితే చాలా రకాల సదుపాయాలు ఉంటాయి. కానీ ప్రజాక్షేత్రంలో అలా చేస్తామంటే కుదరదు. పవన్ కళ్యాణ్ సైతం ఆడంబరాలకు దూరంగా ఉంటారు. సామాన్య ప్రజలతో సైతం ఇట్టే కలిసి పోతారు. కొద్దిరోజుల కిందట వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఆ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్నా లెక్క చేయలేదు. కాలి వరకు బురదతో పాటు నీరు ఉన్నా పట్టించుకోలేదు. అయితే పవన్ అలా వెళ్లడం ఒక్కసారి కాదు. అంతకుముందు వారాహి యాత్ర, కౌలు రైతుల సహాయార్థం నగదు అందించినప్పుడు, ఎన్నికల ప్రచారం.. ఇలా క్షణం తీరిక లేకుండా ప్రజల్లోనే గడిపారు పవన్. ఈ క్రమంలోనే ఆయన అనారోగ్యానికి సైతం లెక్కచేయని సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పవన్ హైదరాబాదులో ట్రీట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం.