Pawan And Lokesh: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి. ఇక్కడ ఎన్నికలతో పని ఉండదు. నిత్యం రాజకీయ రచ్చ నడుస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు 2029 ఎన్నికలపై రకరకాల రచ్చ నడుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారన్న ప్రచారం భారీగా సాగుతోంది. కూటమి అవసరాల దృష్ట్యా పవన్ అడుగులు జాతీయ రాజకీయాల వైపు వెళతాయన్న మాత్రం నడుస్తోంది. 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే స్థానంతో పాటు ఎంపీ గా పోటీ చేస్తారని పొలిటికల్ వర్గాల్లో ఒక ఊహాగానం బయటకు వచ్చింది. జాతీయస్థాయిలో తన బలాన్ని పెంచుకుంటారని.. ఆ దిశగా కేంద్ర ప్రజలతో చర్చలు కూడా పూర్తయ్యాయని.. నరేంద్ర మోడీ టీం లో పవన్ సైతం ఒక సభ్యుడు అవుతారని అనేక రకాల విశ్లేషణలు వస్తున్నాయి.
* కూటమి బలమైన శక్తిగా..
ఏపీలో కూటమిని ఒక బలమైన శక్తిగా ఉంచుతూనే… జాతీయస్థాయిలో చక్రం తిప్పాలన్నది పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే నరేంద్ర మోడీకి జాతీయ స్థాయిలో బలమైన బృందం ఉంది. అందులో పవన్ సభ్యుడు అయితే దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను ఆయనకు అప్పగించవచ్చు అన్నది బిజెపి పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. దక్షిణాదిన ఉన్న ఈ ఐదు రాష్ట్రాలు ఇప్పుడు బిజెపికి కీలకం. ఉత్తరాది రాష్ట్రాల పొలిటికల్ ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఇప్పటికే వరుసగా మూడుసార్లు అధికారంలోకి రావడంతో బిజెపి పట్ల వచ్చే ఎన్నికల నాటికి కొంత వ్యతిరేకత రావచ్చు అన్నది ఒక అంచనా. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో 100 పార్లమెంటు సీట్లపై దృష్టి పెట్టిన బిజెపి పెద్దలు.. ఆ బాధ్యతను పవన్ కళ్యాణ్ పై పెట్టినట్లు సమాచారం.
* దక్షిణాది రాష్ట్రాల్లో గట్టి ప్రభావం..
పవన్ కళ్యాణ్ ఒక్క ఏపీలోనే కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపగలరు. తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా సనాతన ధర్మం పేరిట బలమైన నినాదంతో బయటకు వచ్చారు పవన్. దీంతో హిందూ మతం పై అమితమైన ప్రేమ ఉన్నవారు పవన్ కు ఇట్టే దగ్గరవుతారు. ఆ ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ ద్వారా తమిళనాడులో రాజకీయం మొదలుపెట్టింది భారతీయ జనతా పార్టీ. సినిమాల పరంగా దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అందరికీ సుపరిచితులు. అందుకే పవన్ సేవలను జాతీయస్థాయిలో వాడుకోవాలని బిజెపి పెద్దల ఆలోచన.
* లోకేష్ కు ఏపీ పగ్గాలు..
2029లో కూటమి వస్తే పవన్ కళ్యాణ్ పాత్ర ఏమిటనేది ఒక ప్రశ్న. ఏపీలో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం ఉంది. ఆ పార్టీ సింహభాగం రాజకీయ ప్రయోజనాలు కోరుకుంటుంది. పైగా చంద్రబాబు వారసుడిగా లోకేష్ ఉన్నారు. ఆయన తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో లోకేష్ కు ఏపీ ముఖ్యమంత్రిగా.. పవన్ కళ్యాణ్ కు కేంద్ర క్యాబినెట్లో బలమైన పోర్టు పోలియో ఇవ్వడం ద్వారా.. ఇద్దరికీ సమప్రధాన్యం ఇవ్వాలని కేంద్ర పెద్దలు ఆలోచిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం తో పాటు కాకినాడ ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని ప్రచారం నడుస్తోంది. ఇందులో ఎంత వాస్తవం ఉందో వారికే తెలియాలి.