Pawan Kalyan Vs YCP : ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ కి ఒక్క సీట్ కూడా రాకుండా చెయ్యడమే మన లక్ష్యం : పవన్ కళ్యాణ్

నసేన పార్టీ ఊపు చూస్తుంటే నిజంగానే వైసీపీ పార్టీ ఉభయగోదావరి జిల్లాల్లో క్లీన్ బౌల్డ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

Written By: Vicky, Updated On : June 18, 2023 9:49 am
Follow us on

Pawan Kalyan Vs YCP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వైపే చూస్తుంది, గత రెండు రోజులుగా ఆయన ఉభయ గోదావరి జిల్లాల నుండి ‘వారాహి యాత్ర’ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కత్తిపూడి సభతో ప్రారంభమైన వారాహి యాత్ర , మొన్న పిఠాపురం సభతో  కొనసాగి, నేడు కాకినాడ కి చేరుకుంది. రేపు కాకినాడ లో భారీ బహిరంగ సభని ఏర్పాటు చెయ్యబోతున్నాడు పవన్ కళ్యాణ్.

ఈ సభలో ఆయన ఏమి మాట్లాడబోతున్నాడు అనే దానిపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఇది ఇలా ఉండగా నేడు ఆయన కొంతమంది ముఖ్య నాయకులతో కాకినాడ లో భేటీ నిర్వహించి,అనంతరం జనవాణి కార్యక్రమం నిర్వహించాడు. ఈ జనవాణి కార్యక్రమం లో పవన్ కళ్యాణ్ వివిధ సమస్యలపై ప్రజల నుండి వినతి పత్రాలు సేకరించి, వాళ్ళ కష్టాలను మీడియా ముందుకు తీసుకొచ్చాడు. అనంతరం ఆయన కాకినాడ జనసేన పార్టీ నాయకులూ మరియు కార్యకర్తలతో ఆంతరంగిక సమావేశం ఏర్పాటు చేసాడు.

ఈ కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ ‘ఉభయ గోదావరి జిల్లాలు వైసీపీ రహిత జిల్లాలుగా నిలవాలి. వచ్చే ఎన్నికలలో కనీసం వాళ్లకి ఒక్కటంటే ఒక్క సీట్ కూడా రప్పించకూడదు, ఆ విధంగా మనం పనులు చెయ్యాలి. ఎందుకంటే రాబొయ్యే ఎన్నికలలో రాజ్యాధికారం ఉభయ గోదావరి జిల్లాల చేతిలోనే ఉంది. నేడు జనసేన పార్టీ పెట్టి విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకొని, ఘోరమైన పరాజయం తర్వాత కూడా ఇంత పెద్ద సమూహం ఏర్పడింది అంటే అందుకు కారణం మన అందరం నమ్మిన బలమైన ఉన్నత విలువలతో కూడుకున్న సిద్ధాంతాల వల్లే.

నా ప్రతినిధులుగా ప్రజల్లోకి వెళ్లి పని చెయ్యండి, త్యాగం తో కూడిన బాధ్యతగల నాయకులుగా మీరందరు ఎదగాలి’ అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. జనసేన పార్టీ ఊపు చూస్తుంటే నిజంగానే వైసీపీ పార్టీ ఉభయగోదావరి జిల్లాల్లో క్లీన్ బౌల్డ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.