TTD Chairman New Appointment: ఏపీలో( Andhra Pradesh) మంత్రివర్గ విస్తరణ పై రకరకాల ప్రచారం నడుస్తోంది. ఆశావహులు చూస్తే చాలామంది ఉన్నారు. మంత్రివర్గంలో ఉన్న వారిని తొలగిస్తేనే కొత్త వారు చేరేది. అయితే ఇది సాహసంతో కూడుకున్న పని అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవర్ని కదిలించినా కష్టమే. అలాగని కదిలించకుండా ఉండలేరు. జూనియర్ల నుంచి సీనియర్ల దాకా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. పైగా లోకేష్ టీం.. చంద్రబాబు టీం అంటూ కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే మంత్రులుగా అవకాశం ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తారని తెలుస్తోంది. అన్నింటికంటే మించి ఇప్పుడు టిటిడి అధ్యక్షుడిని మార్చి కొత్తవారిని నియమిస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి టిటిడి అధ్యక్ష పదవి మారుస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత అధ్యక్షుడు బి.ఆర్ నాయుడు పై వచ్చిన ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో ఆయన మార్పు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే కొత్తగా టీటీడీ అధ్యక్ష పదవి ఉత్తరాంధ్ర నేతకు వరించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.
* అత్యంత కీలక పదవి..
టీటీడీ ట్రస్ట్ బోర్డు( TTD trust board) అంటేనే ఏపీ ప్రభుత్వంతో సమానమైనదని భావిస్తారు. అక్కడ అధ్యక్షుడికి రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కే గౌరవం దక్కుతుంది. టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు రాష్ట్ర మంత్రులతో సమానంగా గౌరవమర్యాదలో అందుకుంటారు. అందుకే టీటీడీ అధ్యక్ష పదవికి విపరీతమైన పోటీ ఉంటుంది. ప్రభుత్వాలు ఆ పదవులకు నామినేట్ చేస్తాయి. అయితే గతంలో చాలా సామాజిక వర్గాలు ప్రాతినిధ్యం వహించాయి టిటిడి అధ్యక్ష పదవికి. ప్రస్తుత అధ్యక్షుడు బి.ఆర్ నాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వైసిపి హయాంలో ఇద్దరు పదవులు చేపట్టగా.. వారు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. అందుకే ఈసారి కాపు సామాజిక వర్గం నేతకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది.
* కళా వెంకట్రావుకు ఛాన్స్..
టిటిడి అధ్యక్షుడిగా ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి,, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు( kimidi Kala venkatrao ) పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఆయన సీనియర్ నేత బొత్సను ఓడించారు. అందుకే మంత్రి పదవి దక్కుతుందని ఊహాగానాలు వచ్చాయి. వివిధ సమీకరణలో భాగంగా ఆయనకు ఛాన్స్ రాలేదు. అయితే ఈసారి టీటీడీ అధ్యక్ష పదవి ఇచ్చి ఆయనను గౌరవిస్తారని తెలుస్తోంది. టిడిపి ఆవిర్భావం నుంచి కళా వెంకట్రావు ఆ పార్టీలో పని చేస్తూ వచ్చారు. కానీ మధ్యలో ఒకసారి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లడం ఆయనకు మైనస్ గా మారింది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు మంత్రి పదవి అందుకే దక్కలేదు. అందుకే ఈసారి టిటిడి అధ్యక్ష పదవి ఇచ్చి సామాజిక సమతూకం.. ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం ఇచ్చామన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.