Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: సెమీ స్లీపర్ బస్సు లేదు కానీ.. ఎయిర్ పోర్టు కడతారట.. చంద్రబాబుపై సెటైర్లు

Chandrababu: సెమీ స్లీపర్ బస్సు లేదు కానీ.. ఎయిర్ పోర్టు కడతారట.. చంద్రబాబుపై సెటైర్లు

Chandrababu: చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడే.. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ విజినరీ వెనుక ఎల్లో మీడియా కృషి కూడా ఉంది. ఐటీ డెవలప్మెంట్ వెనుక చంద్రబాబు.. డ్వాక్రా మహిళా సంఘాల ఏర్పాటు వెనుక చంద్రబాబు అంటూ ఫోకస్ చేసింది ఎల్లో మీడియా. దార్శనికుడా అని ప్రపంచం గుర్తించేలా చేసింది ఎల్లో మీడియా. ఏదైనా ఒక అభివృద్ధి, భావితరాలకు దిక్సూచిగా నిలిచే ఈ అంశం పైన చర్చ జరిగినప్పుడు.. దీని వెనుక ఉన్నది చంద్రబాబు అంటూ కథనాలు ప్రచురించడంలో ఎల్లో మీడియా ఉంటుంది. చంద్రబాబు పావలా చేస్తే.. దానిని పది రూపాయలుగా చూపించడంలో ఆ సెక్షన్ ఆఫ్ మీడియా కృషి ఉంది.

రాజీవ్ గాంధీ హయాంలో ఐటీ కి అత్యంత ప్రాధాన్యత దక్కింది. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ రంగం అప్పుడప్పుడే ఎంటర్ అవుతోంది. అటువంటి సమయంలో కాంగ్రెస్ ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ దేశంలో ఎక్కడెక్కడ ఐటీ అభివృద్ధికి అవకాశం ఉందో శూల శోధన చేశారు. అప్పుడే బెంగళూరు, హైదరాబాద్, ముంబాయి తారసపడ్డాయి. అప్పట్లో ఆ మూడు రాష్ట్రాలు కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. ఆ సమయంలోనే హైదరాబాద్ కు వచ్చింది హైటెక్ సిటీ. దానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించినది సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. కానీ తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దానిని పూర్తి చేసి క్రెడిట్ కొట్టేశారు. దాని వెనుక కూడా ఎల్లో మీడియా కృషి ఉంది. దీని క్రెడిట్ ఏకపక్షంగా చంద్రబాబుకు బదలాయించడంలో ఆ సెక్షన్ అఫ్ మీడియా సక్సెస్ అయ్యింది. ఇప్పటికీ అదే పరంపర కొనసాగిస్తోంది.

దేశవ్యాప్తంగా డ్వాక్రా మహిళా సంఘాలను తెచ్చిన ఘనత అటల్ బిహారీ వాజపేయి ది. గుజరాత్ లో సక్సెస్ అయిన డ్వాక్రా విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని బిజెపి భావించింది. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అప్పట్లో ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబుకు ఈ అరుదైన గౌరవం లభించింది. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను స్థాపించి.. మహిళల స్వయం సమృద్ధి సాధనకు వీలు కల్పించారు. స్వయం ఉపాధి పథకాలతో పాటు రుణాలను కూడా ఇప్పించారు. 1999 ఎన్నికల్లో చంద్రబాబు రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం డ్వాక్రా మహిళలే. అయితే ఈ విధానం చంద్రబాబు మానస పుత్రిక అని ప్రచారం చేయడంలో ఎల్లో మీడియా సక్సెస్ అయ్యింది. డ్వాక్రా విధానానికి ఆధ్యుడు చంద్రబాబు అని ఈ సెక్షన్ ఆఫ్ మీడియా విస్తృత ప్రచారం చేసింది. ఇప్పటికీ ఏ సందర్భం వచ్చినా ఈ ప్రచారాన్ని మాత్రం వీడడం లేదు.

చంద్రబాబు సుదీర్ఘకాలం కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. సరైన రవాణా సదుపాయాలు లేవన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కోణంలో ఆలోచించి జగన్ కుప్పంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అయితే తాజాగా చంద్రబాబు ఒక ప్రకటన ఇచ్చారు. ఒక హామీ గుప్పించారు. కుప్పం ప్రాంతంలో పండించిన కూరగాయలను అంతర్జాతీయ మార్కెట్లో చేర్చేందుకు కృషి చేస్తానని.. అవసరమైతే ఒక డొమెస్టిక్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందే ప్రధాని మోదీ ఈ తరహా ప్రకటన చేశారు. నోయిడాలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు ఆ ప్రకటనను మార్గదర్శకంగా తీసుకున్నారు. తాను సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అని మరిచి మరి ఈ ప్రత్యేక ప్రకటన చేశారు. కనీసం ఒక ఏసీ స్లీపర్ కోచ్ బస్సు రాని కుప్పానికి.. డొమెస్టిక్ ఎయిర్ పోర్టు తీసుకొస్తారా? అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. కానీ ఎల్లో మీడియాకు అలవాటైన విద్య కావడంతో ప్రత్యేక కథనాలు ప్రచురించడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version