Nara Lokesh Team Ready In Uttarandhra: ఏపీ రాజకీయాల్లో ఉత్తరాంధ్ర కీలకం. ఉత్తరాంధ్రలో ఏ పార్టీ మెజారిటీ సీట్లు దక్కించుకుంటే అదే పార్టీ అధికారంలోకి రాగలదు. ప్రధానంగా ఉత్తరాంధ్రలో బిసి వర్గాలు అధికం. మత్స్యకారులు కూడా ఉన్నారు. గిరిజనులు కూడా నివసిస్తున్నారు. అయితే ప్రతి రాజకీయ పార్టీ ఉత్తరాంధ్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే పనిలో ఉంది. ఉత్తరాంధ్రలో యువనాయకత్వానికి ప్రోత్సాహం అందించడం ద్వారా.. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని చూస్తోంది. ఆపై తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసి.. మరో నాలుగు దశాబ్దాల పాటు అవసరమైన నాయకత్వాన్ని అందించాలని భావిస్తోంది. అందులో భాగమే చింతకాయల విజయ్ కు రాజ్యసభ పదవి. ఒక్క మాటలో చెప్పాలంటే లోకేష్ టీం ఉత్తరాంధ్రలో రంగంలోకి దిగిందన్నమాట. 2024 ఎన్నికల తరువాత తీసుకున్న నిర్ణయాలు చూస్తే టిడిపి యువతకు పెద్దపీట వేసినట్టే.
కింజరాపు రామ్మోహన్ నాయుడు..
కచ్చితంగా తెలుగుదేశం పార్టీలో యువనేతల్లో లోకేష్ తర్వాత ఎవరు? అంటే ముందుగా గుర్తొచ్చేది కింజరాపు రామ్మోహన్ నాయుడు. పార్టీలో కూడా విపరీతమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు రామ్మోహన్ నాయుడు. కేవలం యువనేతలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి మూడోసారి గెలిచిన రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించారు. కీలకమైన పౌర విమానయాన శాఖను అందించారు. మరోవైపు మొన్నటి ఎన్నికల్లో గజపతినగరం నుంచి యువకుడైన కొండపల్లి శ్రీనివాస్ కు అవకాశం ఇచ్చారు. రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి చింతకాయల విజయ్ ను రాజ్యసభకు పంపించారు. ఉత్తరాంధ్రలో బలోపేతం కావడంతో పాటు టిడిపికి భవిష్యత్తు నాయకత్వం అందించేందుకుగాను ఈ నిర్ణయాలు అన్నట్టు ఉన్నాయి. వీరు మాత్రమే కాదు దాదాపు నేతల వారసులందరికీ ఛాన్స్ అందించింది టిడిపి.
చంద్రబాబుకు మాదిరిగానే..
ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఐదు వరకు పార్లమెంటు సీట్లు కూడా ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో 32 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది టిడిపి కూటమి. నాలుగు పార్లమెంటు స్థానాలను దక్కించుకుంది. అయితే ఇదే దూకుడు కొనసాగాలి అంటే యువనాయకత్వం రావాలి అన్న ఆలోచనలో టిడిపి ఉంది. అందుకే కింజరాపు రామ్మోహన్ నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, చింతకాయల విజయ్ వంటివారికి ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. పైగా వీరంతా లోకేష్ టీమ్ గా ముద్ర ఉంది. ఆముద్రను బలంగా చాటుకోవాలని భావిస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడుకు వలయంగా ఉండేవారు కింజరాపు ఎర్రన్నాయుడు, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, అశోక్ గజపతిరాజు లాంటివారు. ఇప్పుడు వారు వారసులు రంగంలోకి వచ్చారు లోకేష్ కోసం. మొత్తానికైతే చాప కింద నీరులా లోకేష్ టీం విస్తరిస్తోంది ఉత్తరాంధ్రలో..
