Nara Lokesh: ప్రత్యర్థులే అభినందించేలా.. లోకేష్ విజన్ ను బయటపెట్టిన జాతీయ మీడియా

దేశవ్యాప్తంగా చాలామంది రాజకీయ వారసులు వచ్చారు. అందరి మాదిరిగానే లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఎవరిపై జరగని దుష్ప్రచారం.. లోకేష్ పై జరిగింది. కానీ వాటన్నింటినీ మౌనంగా భరిస్తూ ముందుకు సాగారు లోకేష్. తనలో ఉన్న నాయకత్వాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ.. తాను ఫెయిల్యూర్ కాదని.. సక్సెస్ ఫుల్ పొలిటిషియన్ అని రుజువు చేసుకుంటున్నారు.

Written By: Dharma, Updated On : October 15, 2024 2:08 pm

Nara Lokesh(1)

Follow us on

Nara Lokesh: ప్రత్యర్థులకు అందని రీతిలో లోకేష్ అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నారు. మొన్నటి వరకు ఆయన ఒక ఫెయిల్యూర్ నాయకుడు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ప్రత్యర్థుల వేధింపులకు గురైన ఒకే ఒక రాజకీయ వారసుడు లోకేష్. తండ్రి అకాల మరణంతో జగన్ తనలో ఉన్న నాయకత్వాన్ని బయట పెట్టుకున్నారు. సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. దూకుడుగా వ్యవహరించి అందరి మనసును గెలిచారు. తండ్రి అకాల మరణంతో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్న నినాదంతో బయటకు వెళ్లారు. జైలు జీవితం అనుభవించినా.. అంతకుమించి చిన్న వయసులోనే ఈ రాష్ట్ర పాలకుడిగా మారారు జగన్.రాజకీయంగా ఇబ్బందిపడినా.. అనుకున్నది మాత్రం సాధించగలిగారు.అయితే లోకేష్ విషయంలో అలా కాదు. తండ్రి రాజకీయాల్లో ఉండగానే ఎంట్రీ ఇచ్చారు. అది కూడా తండ్రి గెలుపు బాటలో ఉండగా రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి శత్రువులు కూడా ఆయనకు శత్రువులయ్యారు. చంద్రబాబుకు మించి లోకేష్ ను వారు శత్రువుగా పరిగణించారు. ఆయనపై వ్యక్తిగత దాడికి దిగారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు.బహుశా దేశంలో ఏ రాజకీయ వారసుడికి ఇంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురు కాలేదు. వాటన్నింటినీ అధిగమించి ఈ స్థాయికి వచ్చారు. రాళ్లు వేసిన వారే.. పూలతో ఆహ్వానం పలికేలా చేసుకున్నారు లోకేష్. తన నాయకత్వాన్ని క్రమేపి పెంచుకుంటూ వచ్చారు.

* అడ్డంకులను అధిగమిస్తూ..
వైసిపి అధికారంలో ఉండగానే సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు. ఆ సమయంలో వైసీపీ అడ్డంకులు అన్నీ ఇన్ని కావు. కూర్చోవడానికి కుర్చీ లేకుండా చేశారు. ముందుకు కదిలేందుకు ఆంక్షలు విధించారు. పోలీస్ యంత్రాంగం ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వాటన్నింటిని అధిగమించి తన పాదయాత్రను పూర్తి చేసుకోగలిగారు. అదే సమయంలో తండ్రిని అకారణంగా అరెస్టు చేశారు. ఆ సమయంలో లోకేష్ స్థితప్రజ్ఞత కనబరిచారు. న్యాయ నిపుణులతో ఆలోచనలు, జాతీయ నేతలతో సంప్రదింపులు చేసిన విధానం ఆయనలో పరిణితిని తెలియజేసింది. ఏపీలో కూటమి కట్టడం, మిత్రపక్షాలతో సమన్వయం, సొంత పార్టీ శ్రేణులను అదుపులో పెట్టుకోవడం వంటి చర్యలతో లోకేష్ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. జాతీయస్థాయిలో సైతం గుర్తింపు సాధించారు.

* జాతీయస్థాయిలో గుర్తింపు
అయితే ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. లోకేష్ మంత్రి అయ్యారు. మానవ వనరుల శాఖతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను దక్కించుకున్నారు. ఇప్పుడు పూర్తి దార్శనికతతో వ్యవహరిస్తున్నారు. ఆయనలో ఉన్న ఈ కోణాన్ని చూసి జాతీయ మీడియా ఛానళ్లు ఇంటర్వ్యూ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. తాజాగా టైమ్స్ నౌ ఎడిటర్ నావికా కుమార్ లోకేష్ ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలు చేయడంలో మంచి రికార్డులు ఉన్న నావికా కుమార్ లోకేష్ చెప్పిన సమాధానాలకు ఫిదా అయ్యారు.

* ఎటువంటి తొందరపాటు లేకుండా
ఏపీలో కూటమి ప్రభుత్వం చేపట్టబోయే ప్రాజెక్టులు, భవితకు కల్పించే అంశాలు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వంద రోజుల్లో తాము సాధించిన ప్రగతి గురించి లోకేష్ ఈ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు.ఎక్కడ ఎటువంటి తొందరపాటు లేకుండా.. నావికా కుమార్ అడిగిన ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలు చెప్పారు లోకేష్. ఈ ఇంటర్వ్యూ చూసినవారు నిజంగా లోకేషేనా అన్నట్టు ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం.