Nara Lokesh: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు సమీపిస్తోంది. పాలనను గాడిలో పెడుతూ అభివృద్ధితోపాటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోంది కూటమి. అయితే అంతకుముందు ఉన్న ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన చాలా వాటిని పూర్తిచేస్తూ.. కొత్త వాటికి చెల్లింపులు చేస్తోంది. తాజాగా విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 1200 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. జగన్ సర్కార్ 4వేల కోట్లను బకాయి పెట్టిందని గుర్తు చేశారు. దీనిపై శాసనమండలిలో వైసిపి పక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ తీరును తప్పుపడుతూ.. సభ నుంచి వాకౌట్ చేశారు.
* భూ కేటాయింపుల ప్రస్తావన..
ప్రభుత్వ విద్యావ్యవస్థకు సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ శాసనమండలిలో పలు అంశాలను ప్రస్తావించింది.. ఈ క్రమంలో విశాఖలో గీతం విద్యాసంస్థల భూ కేటాయింపులతో పాటు వివిధ పరిశ్రమలు, సంస్థలకు భూ కేటాయింపుల విషయమై బొత్స ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా భూ కేటాయింపులు జరిపితే.. దానిని నిరూపిస్తే.. మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మంత్రిగా బొత్స ఉండే సమయంలో విజయనగరం జిల్లాలో ఆయన కుటుంబ సభ్యులు.. కోట్లాది రూపాయల భూములను కారు చౌకగా కొట్టేసారని మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై శుక్రవారం చర్చ జరిగే అవకాశం ఉందని ప్రచారం నడిచింది. ఇటువంటి పరిస్థితుల్లో మంత్రి బొత్స ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ వైసిపి సభ్యులతో కలిసి శాసనమండలిని వాకౌట్ చేయడం విశేషం. అంతకుముందు సభలో విద్యావ్యవస్థ పై జరిగిన చర్చలో బొత్సతో మంత్రి నారా లోకేష్ వాగ్వాదానికి దిగారు.
* ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు బొత్స( Botsa Satyanarayana) . పాఠశాల విద్యా శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలో కొన్ని రకాల చెల్లింపులు, సక్రమంగా జరగలేదు. ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలను అప్పటి జగన్ సర్కార్ విద్యార్థులకు అందించకుండా ఇబ్బంది పెట్టింది. ప్రైవేటు కాలేజీల్లో చేరే విద్యార్థులకు సైతం ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సామాన్య పేద విద్యార్థులు సైతం ప్రైవేట్ కాలేజీల్లో చేరారు. కానీ ఫీజు రీయంబర్స్మెంట్ మాత్రం చెల్లించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెట్టాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ప్రాధాన్యత క్రమంలో విడుదల చేస్తూ వస్తోంది. నిన్ననే 1200 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయాన్ని లోకేష్ ఈరోజు శాసనమండలిలో ప్రస్తావించేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు తట్టుకోలేకపోయారు. అందుకే బొత్స సభను వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటన చేసి బయటకు వెళ్లిపోయారు.