CM Chandrababu reduce convoy: పశ్చిమ ఆసియాలో యుద్ధం నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పొదుపు అంశాలపై పిలుపునిచ్చారు. ప్రధానంగా ఇంధన పొదుపు పై కీలక సూచనలు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఏపీ ప్రజలకు ప్రత్యేక సూచనలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే ముందుగా తాము పొదుపు పాటించాలని భావించారు సీఎం చంద్రబాబు. తనతో పాటు మంత్రుల కాన్వాయ్ లో వాహన శ్రేణి తగ్గించారు. ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశం వేదికగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రుల దాకా తమ కాన్వాయ్ లో వాహనాలు తగ్గించుకోవడం కనిపించింది.
క్యాబినెట్ భేటీ..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో క్యాబినెట్ భేటీ జరిగింది. దాదాపు పదికి పైగా వాహనాలతో వచ్చే చంద్రబాబు కేవలం నాలుగు వాహనాలకు మాత్రమే పరిమితం అయ్యారు. భద్రతా సిబ్బంది ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారికోసం ఒక బస్సు ఏర్పాటు చేశారు. మంత్రి లోకేష్ సైతం తన కాన్వాయ్ ను తగ్గించుకున్నారు. కేవలం రెండు వాహనాలతో వచ్చారు. సీఎం మాదిరిగా తన సెక్యూరిటీ సిబ్బంది కోసం ఒక బస్సు ఏర్పాటు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ సైతం తన కాన్వాయ్ ని తగ్గించుకున్నారు. జడ్ క్యాటగిరి లో ఉన్న దుబారా తగ్గించేందుకు వీలుగా పవన్ సగానికి పైగా వాహనాలను తగ్గించుకోవడం విశేషం.
ఒకే ఒక్క వాహనంలో వచ్చిన మంత్రులు
చివరికి హోం మంత్రి వంగలపూడి అనిత సైతం తన ప్రోటోకాల్ పక్కన పెట్టి మరి తన వాహన శ్రేణిని తగ్గించుకున్నారు. కొందరు మంత్రులు అయితే సింగిల్ వాహనంలో క్యాబినెట్ భేటీకి హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు ఎనిమిది పొదుపు అంశాలపై ఏపీ ప్రజలకు ప్రత్యేకంగా అవగాహన కల్పించేందుకు నిర్ణయించారు సీఎం చంద్రబాబు. ప్రధాని హైదరాబాద్ పర్యటనలో భాగంగా కీలక సూచనలు ఇవ్వగా ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఆచరించి.. మిగతా వారికి చెబితే బాగుంటుందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వంలో పొదుపు చర్యలు ప్రారంభం కావడం విశేషం.