MLC Duvvada Family: ఏపీని కుదిపేస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వివాదం.. ఇప్పుడు కూడా స్పందించకపోతే ఎలా జగన్?

ఒక్కోసారి మన వ్యాఖ్యలే మనల్ని తప్పు పట్టేలా చేస్తాయి. ఒక వేలిని మనం అటు చూపిస్తే.. నాలుగు వేళ్ళు తిరిగి చూపించే రోజులు ఇవి. అందుకే ఆడిన మాట, చేసిన కామెంట్స్ ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలి. ఈ విషయంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బాధితుడుగా మారారు.

Written By: Dharma, Updated On : August 10, 2024 11:17 am

MLC Duvvada Family

Follow us on

MLC Duvvada Family: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. భార్య ఉండగా మరో మహిళతో దువ్వాడ సహజీవనం చేస్తున్నారన్నది ఆరోపణ. రెండు రోజుల కిందట తండ్రి కోసం వెళ్లిన ఇద్దరు కుమార్తెలకు కనీసం ఇంట్లోకి వెళ్లేందుకు కూడా వీలు లేకుండా చేశారు. దాదాపు నాలుగు గంటల పాటు ఇంటి బయటే వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే గేటు తలుపులు కూడా తీయలేదు. లోపల లైట్లు ఆఫ్ చేసి ఊరుకున్నారు. ఆ సమయంలో దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఉన్నారని కుమార్తెలు అనుమానించారు. తండ్రి కోసం పలుమార్లు ఫోన్ చేశారు. మెసేజ్ కూడా పెట్టారు. అయినా సరే తండ్రి నుంచి స్పందన లేకపోవడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. మీడియాలో దీనిపై కథనాలు వచ్చాయి. సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తింది. అయినా సరే ఇంతవరకు దువ్వాడ మీడియా ముందుకు రాలేదు. అటు వైసిపి హై కమాండ్ సైతం స్పందించలేదు. కనీసం దీనిపై ఒక ప్రకటన కూడా చేయలేదు. ఎన్నికల ముందు నుంచే దువ్వాడ కుటుంబంలో వివాదం నడుస్తోంది. మరో మహిళతో సంబంధం పెట్టుకోవడంతో భార్య దువ్వాడ వాణి శ్రీనివాస్ తో విభేదించారు. అందుకే జగన్ వద్ద పంచాయతీ పెట్టారు. టెక్కలి టికెట్ కోసం పట్టుపట్టారు. అనివార్య పరిస్థితుల్లో దువ్వాడ వాణి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు జగన్. కానీ ఎన్నికల ముందు తిరిగి దువ్వాడ శ్రీనివాస్ కి టికెట్ కేటాయించారు. అప్పటినుండి ఆ కుటుంబంలో అశాంతి నెలకొంది. ఎన్నికల్లో వైసీపీ ఓటమితో నివురు గప్పిన నిప్పులా మారింది. ఇప్పుడు ఏకంగా రోడ్డున పడింది.

* ఏపీలో ఇదే హాట్ టాపిక్
ప్రస్తుతం మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. కానీ వైసీపీ హై కమాండ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆ పార్టీ విధానం ఇదేనా అంటూ నిలదీతలు ఎదురవుతున్నాయి.అయితే ఆది నుంచి వైసిపి నేతల వ్యక్తిగత వ్యవహారాలు ఇలానే ఉండేవి. అప్పట్లో అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ మహిళల పట్ల వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అప్పుడు కూడా వైసీపీ నాయకత్వం వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరో ఎంపీ న్యూడ్ వ్యవహారం జాతీయస్థాయిలో చర్చకు దారితీసింది. అప్పట్లో కూడా సదరు నేతపై ఎటువంటి చర్యలు లేవు. అయితే వైసిపి నేతల వ్యక్తిగత వ్యవహార శైలి ఇలా ఉంటే… ఈ నేతలంతా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకునేవారు. చివరకు జగన్ సైతం పవన్ వ్యక్తిగత జీవితంపై చాలాసార్లు మాట్లాడారు.

* కర్మఫలం అంటూ కౌంటర్
తాజాగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. కర్మఫలం అంటూ జనసేన శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి. గతంలో పవన్ మూడు పెళ్లిళ్లపై దువ్వాడ వివాదాస్పద కామెంట్స్ చేశారు. హిందువుల అన్నవాడు ఎవడైనా రెండో పెళ్లి చేసుకుంటాడా? రాముడు ఏకపత్నివ్రతుడు.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ నీచుడు అంటూ సంభోదించారు. ఇప్పుడు దానినే హైలెట్ చేస్తూ జనసైనికులు దువ్వాడ శ్రీనివాసును టార్గెట్ చేస్తున్నారు. నాడు దువ్వాడ చేసిన కామెంట్స్ ను హైలెట్ చేస్తూ.. కర్మఫలం అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

* స్పందించని హై కమాండ్
గత రెండు రోజులుగా మీడియాలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై కథనాలు వస్తున్నా వైసిపి హై కమాండ్ స్పందించడం లేదు. కనీసం దీనిని ఖండించడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్ దువ్వాడ శ్రీనివాస్ లాంటి నేతలను ప్రోత్సహించారు. ఇప్పుడు వారే వివాదాస్పదులుగా మారడంతో ఎలా ముందుకెళ్లాలో జగన్ కు తెలియడం లేదు. అయితే ఇటువంటి వాటిని అధికారంలో ఉన్నప్పుడు సముదాయించుకోవచ్చు కానీ.. ఇప్పుడు కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే మూల్యం తప్పదు. మరి జగన్ ఆ సాహసం చేస్తారా? లేదా? అన్నది చూడాలి.