Roja: పొరుగు నేతలతో మంత్రి రోజా ప్రచారం

గడిచిన రెండు ఎన్నికల్లో నగిరి నియోజకవర్గం నుంచి స్వల్ప మెజారిటీతో మాత్రమే రోజా గెలుపొందారు.గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో వందల ఓట్ల తేడాతోనే గట్టెక్కారు.

Written By: Dharma, Updated On : May 2, 2024 2:49 pm

Roja

Follow us on

Roja: నగిరి నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని మంత్రి రోజా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెకు టిక్కెట్ దక్కదని ప్రచారం జరిగింది. ఆమెకే టికెట్ ఇస్తే సహకరించమని కూడా కొంతమంది వైసీపీ నేతలు తేల్చి చెప్పారు. కానీ ఎన్నో సమీకరణలను పరిగణలోకి తీసుకొని జగన్ రోజాకు టికెట్ ఇచ్చారు. కానీ స్థానిక వైసిపి నేతల నుంచి ఆమెకు తగినంత సహకారం అందడం లేదు. ఆమె ఓడిపోతే కానీ తత్వం బోధపడదని..అందుకే ఆమెను ఓడించి తీరుతామని కొందరు సీనియర్లు గట్టిగానే చెబుతున్నారు.నియోజకవర్గస్థాయి నేతలు ఆమె వెంట నడిచేందుకు ఇష్టపడడం లేదు. అటు గ్రామస్థాయిలో ప్రభావితం చేసే నేతలు సైతం రోజా ప్రచారంలో కనిపించడం లేదు. దీంతో నగిరి లో రోజా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే ఒంటరిగానైనా ప్రజల మనసు గెలిచి హ్యాట్రిక్ కొడతానని ధీమాతో ఉన్నారు.

గడిచిన రెండు ఎన్నికల్లో నగిరి నియోజకవర్గం నుంచి స్వల్ప మెజారిటీతో మాత్రమే రోజా గెలుపొందారు.గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో వందల ఓట్ల తేడాతోనే గట్టెక్కారు. అయితే రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడం, పార్టీ అధికారంలోకి రావడం, కీలక పదవులు దక్కడం, విస్తరణలో మంత్రి పదవి రావడంతో రోజా వెనకా ముందు చూసుకోలేదు. సీనియర్లను లెక్కచేయలేదు. దీంతో ఐదు మండలాల్లో మెజారిటీ క్యాడర్ రోజా నుంచి చేజారింది. అయినా సరే రోజా లెక్క చేయలేదు.

మరోవైపు టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ దూకుడు పెంచారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు. పుత్తూరు, నగిరి, వడమాల పేట, విజయపురం, నిండ్రా మండలాల్లోని వైసీపీ నాయకులు కనీసం రోజాను లెక్కచేయడం లేదు. కొందరైతే టిడిపి అభ్యర్థికి మద్దతుగా కొంతమంది కార్యకర్తలను పంపిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి రోజా తీరుతో విసిగిపోయిన వైసీపీ నాయకులు ఆమెకు మద్దతుగా ప్రచారం చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో వైసీపీ నేతలు తన వెంట రాకపోవడంతో ఇతర నియోజకవర్గాల నుంచి క్యాడర్ ను తెప్పించుకుంటున్నారు. కనీసం తమను అర్ధించకుండా.. ఈ తరహా చర్యలకు రోజా దిగడంతో.. కొందరు వైసీపీ నేతలు బాహటంగానే ఆమెను వ్యతిరేకిస్తున్నారు. ఎలా గెలుస్తారో చూస్తామని హెచ్చరిస్తున్నారు. బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు.మొత్తానికైతే మంత్రి రోజా ప్రమాదంలో పడినట్టే కనిపిస్తున్నారు.