Mekapati Family Quits YSRCP: ఏపీ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగింది మేకపాటి కుటుంబం. కానీ ప్రస్తుతం రాజకీయంగా దాదాపు కనుమరుగైనట్టే. ఎందుకంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి వయోభారంతో బాధపడుతున్నారు. ఆయన కుమారులు రాజకీయం కంటే వ్యాపారం వైపే మొగ్గు చూపుతున్నారు. ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి సైతం టిడిపిలో ఉన్నారు. కానీ అంతగా యాక్టివ్ గా లేరు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగింది ఆ కుటుంబం. తరువాత జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేసింది. అయితే ఇప్పుడు రాజకీయంగా వెనుకడుగు వేస్తోంది. కుటుంబ పరంగా కూడా తీవ్ర విభేదాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా తన వాటా తనకు ఇవ్వాల్సిందేనని రాజమోహన్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి వీధికి ఎక్కారు. అటు వైసీపీలో సైతం ఆ కుటుంబానికి ప్రాధాన్యత తగ్గింది. ఈ కారణాలతో రాజకీయాలనుంచి పూర్తిగా ఆ కుటుంబం తప్పుకునే అవకాశం ఉంది. అభిమానుల్లో ఒక రకమైన ఆందోళన, ఆవేదన కనిపిస్తోంది.
* సుదీర్ఘ నేపథ్యం..
ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయం చేస్తూ వచ్చింది మేకపాటి కుటుంబం. మేకపాటి రాజమోహన్ రెడ్డి సుదీర్ఘకాలం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆ కుటుంబానికి నెల్లూరు జిల్లాలో మంచి పట్టు కూడా ఉంది. రాజశేఖర్ రెడ్డి తో రాజమోహన్ రెడ్డి ఎంతో సాన్నిహిత్యంతో ఉండేవారు. అదే జగన్మోహన్ రెడ్డి వైపు అడుగులు వేసేలా చేసింది. రాజమోహన్ రెడ్డి కుమారుడు మేకపాటి గౌతంరెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి రాజమోహన్ రెడ్డి కుటుంబాన్ని కృంగదీసింది. గౌతమ్ రెడ్డి స్థానంలో రాజమోహన్ రెడ్డి మరో కుమారుడు విక్రమ్ రెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో రాజమోహన్ రెడ్డి తో పాటు విక్రమ్ రెడ్డి పోటీ చేశారు. కానీ ఇద్దరూ ఓడిపోయారు.
* వైసిపి ఆదరణ కరువు..
అయితే గత ఎన్నికల ఫలితాలు తర్వాత రాజమోహన్ రెడ్డి జగన్ విషయంలో కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్ల నష్టం జరిగిందని ఆరోపించారు. దీంతో మేకపాటి కుటుంబం టిడిపిలోకి వెళ్తుందని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అయితే టిడిపిలోకి వెళ్లడం కంటే రాజకీయాల నుంచి తప్పుకోవడమే మేలన్న నిర్ణయానికి రాజమోహన్ రెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆ కుటుంబంలో ఆస్తులకు సంబంధించిన వివాదం ప్రారంభమైంది. తన వాటా ఆస్తులను ఇవ్వాల్సిందేనని ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు వీధికి ఎక్కారు. ఒకవైపు రాజకీయంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ లేదు. కుటుంబ పరంగా కూడా వివాదాలు జరుగుతున్నాయి. ఇద్దరు కుమారులు రాజకీయాల కంటే వ్యాపారాలపై మొగ్గుచూపుతున్నారు. అందుకే రాజమోహన్ రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు దూరం కావాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
