Janasena: సాధారణంగా ఎన్నికలంటేనే ఎత్తులు, పై ఎత్తులు ఉంటాయి. అలా కాకుంటే అది రాజకీయం ఎలా అవుతుంది. గత ఎన్నికల్లో రెండు చోట్ల పవన్ పోటీ చేశారు. రెండు చోట్ల ఓడిపోయారు. ఇప్పుడు పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి మాత్రమే పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా ఆయనను ఓడించేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసు గుర్తును పోలే విధంగా.. చాలా రకాల గుర్తులను తెరపైకి తెస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం తో పాటు తెలంగాణలో టిఆర్ఎస్, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఇటువంటి సమస్యనే ఎదుర్కొనేవారు. ప్రతి ఎన్నికల్లో రోడ్డు రోలర్, రోటి మేకర్, ట్రక్కు గుర్తులు వారికి ఇబ్బందులు తెచ్చి పెట్టేవి. బిఆర్ఎస్ పార్టీ గుర్తు కారును కూలి ఉండడమే అందుకు కారణం. ఈ గుర్తు సమస్యతో చాలాసార్లు బిఆర్ఎస్ అభ్యర్థులు ఓడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అదే మాదిరిగా పవన్ ను ఓడించేందుకు ప్రత్యర్ధులు ఈ గుర్తు సమస్యను తెరపైకి తేవడం విశేషం.
ఏపీలో నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ బకెట్ గుర్తు కేటాయించింది. ఇది జనసేన గాజు గ్లాస్ గుర్తుకు దగ్గరగా ఉంటుంది. అందుకే జనసేన పార్టీ శ్రేణులు ఒక రకమైన కలవరం కనిపిస్తోంది. ప్రధానంగా ఈ పార్టీ పిఠాపురం పైనే దృష్టి పెట్టింది. అక్కడే పార్టీ అభ్యర్థిని బరిలో దించునుంది. త్వరలో పార్టీ అభ్యర్థి నామినేషన్ కూడా వేయనున్నారు. పొరపాటున జనసేన అభిమానులు గాజు గ్లాస్ గుర్తు అని… బకెట్ పై వేస్తే పవన్ కళ్యాణ్ కు చిక్కులు తప్పవు. అందుకే ఎన్నికల ప్రచార సభల్లో దీనిపై ఫుల్ క్లారిటీ ఇస్తున్నారు. అయితే నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వెనుక వైసిపి ఉందని జన సైనికులు అనుమానిస్తున్నారు. అందుకే పార్టీ శ్రేణులను అలెర్ట్ చేస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో బిజెపితో కలిసి జనసేన పోటీ చేసిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనకు ఎనిమిది అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఆ సమయంలో సైతం నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా రంగంలోకి దిగింది. దీనికి తోడు ఇండిపెండెంట్లు సైతం గాజు గ్లాస్ గుర్తుకు దగ్గరగా ఉన్న.. గుర్తును ఎంచుకునేవారు. ఆ ఎనిమిది నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తుకు పడాల్సిన ఓట్లు.. మిగతా అభ్యర్థుల గుర్తులకు పడ్డాయి. అది జనసేనకు ఎంతో నష్టం చేకూరినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ నగరం పరిధిలో కూడా జనసేన అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయింది ఆ పార్టీ. అప్పట్లో కుట్ర కోణం ఉందని జనసైనికులు ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓడించేందుకు బకెట్ గుర్తును తెరపైకి తెచ్చినట్లు జన సైనికులు అనుమానిస్తున్నారు. ఇటువంటి విష ప్రయత్నాలను గట్టిగా తిప్పి కొట్టాలని భావిస్తున్నారు. అందుకే ఎన్నికల ప్రచార సభల్లో ఓటర్లను, ప్రజలను అలెర్ట్ చేస్తున్నారు.