Malladi Vishnu not seen with YS Jagan: ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కైనా ఏపీలో విజయవాడ కేంద్ర బిందువు. అమరావతి రాజధాని కి దగ్గరగా ఉండడమే కాదు.. దాదాపు అన్ని పార్టీలకు సంబంధించిన కేంద్ర కార్యాలయాలు విజయవాడ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అందుకే పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా విజయవాడకు సంబంధించిన నేతలు ఎక్కువగా కనిపిస్తుంటారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, పట్టాభిలాంటి నేతలు నిత్యం కనిపిస్తుంటారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, అంబటి రాంబాబు, జోగి రమేష్, కోన రఘుపతి, తలసీల రఘురాం లాంటి నేతలు కనిపిస్తుంటారు. కానీ విజయవాడకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాత్రం కనిపించకపోవడం ఆ పార్టీలో ఒక రకమైన చర్చ.
మొన్నటి ఎన్నికల్లో ఛాన్స్ దక్కలే..
మొన్నటి ఎన్నికల్లో మల్లాది విష్ణుకు( Malladi Vishnu) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఆయనను పక్కనపెట్టి ఆయన స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాస్ కు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. దీంతో మల్లాది విష్ణు నొచ్చుకున్నారు. అయినా సరే అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం ఆయన ఏ నియోజకవర్గానికి బాధ్యుడు కాదు. అప్పుడప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి మీడియాతో మాట్లాడి వెళ్లిపోతుంటారు. మిగతా నాయకులు మాదిరిగా జగన్మోహన్ రెడ్డి వెంట పెద్దగా కనిపించరు కూడా. అయితే సమయం కోసం ఆయన వేచి చూస్తున్నారని.. అప్పటివరకు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలని భావించి మాత్రమే కొనసాగుతున్నారన్న అంచనాలతో పాటు అనుమానాలు ఉన్నాయి.
రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో..
2009లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వంగవీటి రాధాకృష్ణ( vangaveeti Radha Krishna ) ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అటువంటి సమయంలో రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా మారారు మల్లాది విష్ణు. ఆ ఎన్నికల్లో పోటీ చేసి వంగవీటి రాధా పైనే గెలిచారు. 2014 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మాత్రం రెండోసారి వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ఆయనను తప్పించారు. కాస్త అసంతృప్తికి గురయ్యారు కానీ పార్టీలోనే కొనసాగారు. ప్రస్తుతం ఆయనకు ఆప్షన్ లేకుండా పోయింది. అయితే వచ్చే ఎన్నికల వరకు వెయిట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి వెంట పెద్దగా కనిపించడం లేదని సమాచారం. మరి అందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలి.
