Nara Lokesh: తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) ప్రక్షాళన దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా పార్టీలో జూనియర్లకు పెద్దపీట వేయాలని భావిస్తున్నారు. పార్టీ ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు గడుస్తున్న తరుణంలో.. కొత్త రక్తం ఎక్కించడం ద్వారా మరికొన్ని దశాబ్దాల పాటు ఉనికి చాటుకునేలా చేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కోటి సభ్యత్వాల నమోదు చేసుకుని రికార్డు సృష్టించింది తెలుగుదేశం పార్టీ. ఓ ప్రాంతీయ పార్టీ చరిత్రలోనే ఇంతటి సభ్యత్వ నమోదు ఎక్కడా లేదు. అయితే దానికి కారణం లోకేష్ కృషి ఫలితమేనని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సభ్యత్వ నమోదు చేపట్టడంతో పాటు.. ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం కూడా సభ్యత్వ నమోదు పెరగడానికి కారణం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ ప్రక్షాళనకు దిగితే బాగుంటుందన్న అభిప్రాయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా లోకేష్ ను( Nara Lokesh) దృష్టిలో పెట్టుకొని పార్టీలో అన్ని కార్యవర్గాల్లో యువతకు పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలో అత్యున్నతంగా భావించే పొలిట్ బ్యూరోలో జూనియర్లకు స్థానం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారు చాలామంది ఈ అత్యున్నత విభాగంలో కొనసాగుతున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు వంటి నేతలు ఏడు పదులు దాటారు. అందుకే వారికి గౌరవమైన పదవుల్లోకి పంపించి పొలిట్ బ్యూరోలోకి జూనియర్లను పంపాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు నారా లోకేష్ తో పాటు నందమూరి బాలకృష్ణకు సైతం పార్టీలో మంచి పదవులు ఇవ్వాలని ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.
* పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా
లోకేష్ ను డిప్యూటీ సీఎం ( deputy CM)చేయాలని టిడిపి శ్రేణుల నుంచి డిమాండ్ వస్తోంది. కూటమి నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గింది తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా జనసేన నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం, పవన్ కళ్యాణ్ కు గౌరవం ఇవ్వాల్సి రావడంతో లోకేష్ విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గారు. మరోసారి అటువంటి ప్రకటనలు చేయవద్దని పార్టీ శ్రేణులకు గట్టి అల్టిమేటం జారీ చేశారు. ఎవరు అవునన్నా కాదన్నా పార్టీలో ఇప్పుడు సుప్రీం గా వ్యవహరిస్తున్నారు లోకేష్. అయితే ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి మరింత స్వేచ్ఛ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. అప్పుడు రాజకీయంగా పరిణితి సాధించి.. అనుకున్నది సాధించగలుగుతారని చంద్రబాబు భావిస్తున్నారు.
* బాలకృష్ణ కు సైతం
మరోవైపు నందమూరి బాలకృష్ణకు( Nandamuri Balakrishna) సైతం పార్టీలో కీలక పోస్టు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2014 నుంచి మూడుసార్లు హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. హ్యాట్రిక్ కొట్టి పార్టీలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో స్టార్ క్యాంపైనర్ గా పనిచేశారు. అయితే మరి కొంతమంది జూనియర్ల పేర్లు పొలిట్ బ్యూరో సభ్యులుగా వినిపిస్తున్నాయి. అందులో విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, కింజరాపు రామ్మోహన్ నాయుడు, అమలాపురం ఎంపీ జి ఎం సి మధుర్ తదితరులకు తప్పకుండా ఛాన్స్ దక్కుతుందని ప్రచారం నడుస్తోంది. ఒకవేళ నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే.. అప్పటివరకు ఆయన నిర్వర్తిస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి బాలకృష్ణకు అప్పగించే అవకాశం ఉంది.
* మేలో మహానాడు
ఈ ఏడాది మే నెలలో పార్టీ పండుగ మహానాడు( mahanadu) నిర్వహించాలని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ సందర్భంగా పార్టీ ప్రక్షాళన నిర్ణయాలను వెల్లడించనున్నారు. గత ఐదు సంవత్సరాలు పాటు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహానాడు చాలా ఘనంగా నిర్వహించారు. అయితే ఈ ఏడాది అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. త్వరలో మహానాడు వేడుకలకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. ఇందుకు సంబంధించి వేదికను కూడా ప్రకటించనున్నారు. మరో రెండు దశాబ్దాల పాటు టిడిపి మనుగడ కొనసాగేలా సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం మాత్రం కనిపిస్తోంది.