YS Jaganmohan Reddy : ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం చవిచూసింది.కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.పార్టీ ఆవిర్భావం నుంచి ఇంతటి గడ్డు పరిస్థితులు ఎన్నడూ చూడలేదు.పార్టీలో పదవులు అనుభవించిన వారు సైలెంట్ అయ్యారు.పదవులు రానివారు అసంతృప్తితో ఉన్నారు. అన్నింటికీ మించి సన్నిహితులు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో జగన్ దిద్దుబాటు చర్యలకు దిగారు. పార్టీ కార్యవర్గాలను బలోపేతం చేసే పనిలో పడ్డారు. వారితో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోనే అత్యుత్తమ పార్టీగా వైసీపీని తీర్చిదిద్దుతానని చెబుతున్నారు. అయితే ఇది అభినందించదగ్గ విషయమే అయినా.. వాస్తవంగా అది సాధ్యమేనా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. ప్రస్తుతం పార్టీలో ఉన్న వారు ఎవరో తెలియడం లేదు. సీనియర్లు మౌనం గా ఉన్నారు. జూనియర్లు భయంతో అన్నారు. పార్టీ శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి. ఇటువంటి క్రమంలో పార్టీ పూర్వ వైభవం అంటే ఎవరికి నమ్మకం రావడం లేదు. పార్టీ అభివృద్ధి అంటే నాలుగు పదవులు పంచడం.. నాలుగు సమావేశాలు ఏర్పాటు చేయడం కాదు. అన్నిటికీ మించి అధినేత జగన్ వైఖరి మారాలి. పార్టీ శ్రేణులతో మమేకమై పనిచేయాలి. వారికి అండగా నిలవాలి. నాయకులకు అందుబాటులో ఉండాలి. ముందు ఆ పని చేయకుండా ఇన్ని మాటలు చెప్పినా అవి ఎందుకు పనికిరావన్న విశ్లేషణలు ఉన్నాయి.
* వైసీపీ అంటే ఆ నలుగురు
వైసిపి అంటే ఆ నలుగురు.అధినేత మాటే శాసనం.నిన్న మొన్నటివరకు వైసీపీలో ఇదే వాతావరణం కల్పించింది.కార్పొరేట్ తరహాలో పార్టీని నడిపించడం జరిగింది. కింది స్థాయి కేడర్ అభిప్రాయాలను కనీసం పరిగణలోకి తీసుకున్న దాఖలాలు లేవు. పేరుకే మంత్రులు. వారికి పవర్స్ ఉండేవి కావు. ఏ నిర్ణయం తీసుకునే హక్కు కూడా ఉండేది కాదు. సీఎంఓ ఆదేశాలు పాటించాల్సి వచ్చేది.అధికారంలో ఉన్న రోజులుచాలా రకాల లోపాలు వెలుగు చూసాయి.కానీ జగన్ మాత్రం ఎటువంటి మార్పులకు దిగలేదు. ఎన్నికల్లో మాత్రం 80 చోట్ల అభ్యర్థులను మార్చి.. తనను చూసి ఓట్లు వేస్తారని భావించారు. అభ్యర్థులను గడ్డి పూచ కింద తీసేశారు. ఇప్పుడు పార్టీ నేతలు, కార్యకర్తలుకృషి చేయాలని కోరుతున్నారు.
* మధ్యవర్తుల పాత్ర
అసలు మార్పు పార్టీ శ్రేణుల్లో కాదు.. తాడేపల్లి ప్యాలెస్ లో చేయాలన్న డిమాండ్ పార్టీ నుంచి వినిపిస్తోంది. అక్కడ కూడా జగన్ కలవాలంటే ఆ నలుగురు అనుమతి అవసరం. వారిని దాటితే కానీ జగన్ దర్శనం వీలుకాదు. సామాన్యులకు ఈ గతి పట్టిందంటే ఒక అర్థం చేసుకోవచ్చు. కానీ పార్టీ ఎమ్మెల్యేలు సైతం జగన్ దర్శనం కోసం నేలల తరబడి వెయిట్ చేయవలసి వచ్చేది. ఒకవేళ ఈ సమస్య అయినా చెప్పుకుందాం అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డిని కలవాల్సిందే. తమ గోడును చెప్పుకోవాల్సిందే. తాము వ్యక్తపరిచిన అభిప్రాయాలు జగన్ వద్దకు చేరే సరికి అనేక మార్పులు సంతరించుకునేవి. అసలు లక్ష్యం దెబ్బతినేది. అందుకే ఇప్పుడు జగన్ దిద్దుబాటు చర్యలకు దిగాలంటే.. ముందు ప్యాలెస్ లోప్రక్షాళన చేయాలన్న డిమాండ్ పార్టీ నుంచి వినిపిస్తుంది.దేశంలో అత్యున్నత పార్టీ మాట దేవుడెరుగు.. ముందు ఏపీలో వైసీపీ అనే పార్టీ ఎంతో కొంత నిలబడగలుగుతుంది. మరి ఆ దిశగా జగన్ అడుగులు వేస్తారా? లేదా? అన్నదిఆయన ఇష్టం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More