KVP Ramachandra Rao: వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం పై రాజకీయ విమర్శలు వస్తుంటాయి. రాజకీయాలు అన్నాక అవి సర్వసాధారణం కూడా. కానీ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విమర్శలను పట్టించుకోవడం లేదు. ఆ పార్టీ నేతలు సైతం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ రాజశేఖర్ రెడ్డి తో అనుబంధం ఉన్నవారు మాత్రం ఆ వ్యాఖ్యలను ఖండిస్తుంటారు. రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నేతగానే ఇష్టపడేవారు వెంటనే రియాక్ట్ అవుతుంటారు. తాజాగా రాజశేఖర్ రెడ్డి పై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై స్పందించారు కెవిపి రామచంద్ర రావు. ఏకంగా పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు. 10 కోట్ల రూపాయల సవాల్ అది. ఇంత జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి నుంచి మాత్రం ఒక్క మాట అనలేదు తన తండ్రి పై జరుగుతున్న ప్రచారంపై. మొన్న కూడా తన తాత రాజారెడ్డి ప్రస్తావన తీసుకొచ్చి.. కుటుంబంపై ప్రచారం జరిగేలా చేశారు.
* వైఎస్ పై పవన్ విమర్శలు..
ఇటీవల తెలంగాణలో రాజకీయ వ్యవహారాలు అందరికీ తెలిసిన విషయమే. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ అటు తిరిగి ఇటు తిరిగి పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభ పెట్టే వరకు తెచ్చింది పరిస్థితి. అయితే ఆ సభకు అనుమతి ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం. దీంతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. ప్రాంతీయ వాదం పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అనుమతులు ఇవ్వక పోవడాన్ని ఆక్షేపించారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి తన విషయంలో ఇలానే వ్యవహరించేందుకు ప్రయత్నం చేశారని.. ఓ ఐపీఎస్ అధికారి ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారని.. తాను రాజకీయాల్లోకి అందుకే వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. దానిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు కెవిపి రామచంద్రరావు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా పేర్కొనే రామచందర్రావుకు అప్పట్లో జరిగిన పరిణామాలు తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్ మాటలను ఖండించారు. పవన్ ఆధారాలతో రుజువు చేస్తే ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 కోట్ల రూపాయలు ఇస్తానని సవాల్ చేశారు. లేకుంటే పవన్ తన ముక్కును నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక ఆత్మీయ స్నేహితుడిగా కెవిపి రామచంద్రరావు సవాల్ లో ఎటువంటి తప్పిదం లేదు.
* రాజశేఖర్ రెడ్డి తో రాజకీయ లబ్ధి..
రాజశేఖర్ రెడ్డి ముఖాన్ని పెట్టుకుని రాజకీయం చేశారు జగన్మోహన్ రెడ్డి. నిత్యం తన సాక్షి మీడియాలో రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకుని వార్తలు ప్రచురిస్తున్నారు. కానీ రాజశేఖర్ రెడ్డి పై రాజకీయం విమర్శలు వచ్చిన సమయంలో జగన్ మాట్లాడడం లేదు. తన పార్టీ నేతలతో మాట్లాడించడం లేదు. ఈ విషయంలో షర్మిల 100 రెట్లు ఎక్కువ. ఎందుకంటే ఆమె రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తన బాధను వ్యక్తం చేస్తుంటారు. ప్రత్యర్థుల ఆరోపణలను ఖండిస్తుంటారు. తన తాతను చంపిన వారిని క్షమించానని.. తనకంటే గొప్ప వారు ఎవరు ఉంటారు అంటూ జగన్ ఆ మధ్యన మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతి తెలిసిందే. అటు తరువాత వైయస్ కుటుంబం పై ప్రత్యర్ధులు ఎదుర దాడి చేశారు. కానీ జగన్ మాత్రం మీడియా ముందుకు వస్తున్నారే కానీ తన తండ్రి పై ఆరోపణలను ఖండించడం లేదు. అయితే తన తండ్రిని ఏమైనా అంటే జగన్ ఊరుకుంటారో ఏమో కానీ తన స్నేహితుడిని అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని కెవిపి రామచంద్రరావు చాటిచెప్పారు.
