Kolikapudi Srinivas Rao Controversy: తెలుగుదేశం పార్టీ నాయకత్వ హెచ్చరికలను లెక్కచేయడం లేదు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అన్న విషయాన్ని మరిచి తరచు వివాదాలను తెచ్చిపెట్టుకుంటున్నారు. ఎప్పటికప్పుడు హై కమాండ్ హెచ్చరికలు జారీ చేస్తున్నా.. ఆయన పెడచెవిన పెడుతూనే ఉన్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ వాట్సాప్ గ్రూప్ లోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మెసేజ్ పెట్టడం హాట్ టాపిక్ అవుతోంది. నేను మారను ఇంతే అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉంది.
Also Read: ప్రియుడి కోసం ఏకంగా తల్లినే.. వామ్మో ఇటువంటి కూతురు పుట్టనే కూడదు
* అమరావతి ఉద్యమ నేపథ్యం..
అమరావతి రాజధాని ఉద్యమం నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావును గుర్తించి టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. కానీ ఆయన తరచూ గొడవలు చేస్తూనే ఉన్నారు. వివాదాల జోలికి వెళ్తూనే ఉన్నారు. అయితే టిడిపి కూటమిపరంగా ఎటువంటి పరిణామం జరిగిన దానిని రాజకీయ లబ్ధికి వైసిపి ఎలానూ ప్రయత్నిస్తుంది. అయితే కొలికపూడి వ్యవహారం కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు ప్రచారం జరిగింది. తిరువూరు ఎమ్మెల్యే వైసీపీ లైన్లో నడుచుకుంటున్నట్లు కూడా ఆయన వ్యవహార శైలి బట్టి అర్థమవుతోంది. చంద్రబాబు పలుమార్లు పిలిచి మాట్లాడారు. ఎంత మాత్రం ఆయన పద్ధతి మారడం లేదు. దీంతో ఆయన ఒక ఫైనల్ డెసిషన్ కు వచ్చినట్లు తెలుస్తోంది. టిడిపి సైతం ఏదో ఒక నిర్ణయానికి రాక తప్పదు.
* చివరి వరకు వేచి చూసి..
అయితే ఆది నుంచి తిరువూరు ఎమ్మెల్యే వైఖరి అలానే ఉంది. టిడిపి హై కమాండ్ సైతం అదిగో ఇదిగో చర్యలు అంటూ ముందుకు వెళ్తోంది. అయితే అనవసరంగా ఒక ఎమ్మెల్యేను వదులుకోవడం అనే దానికంటే.. ఆయన ఎక్కడ వైసీపీకి ఆయుధంగా మారుతారు అనేది ఒక ఆలోచన. అందుకే కొలికపూడి ఎన్ని రకాల తప్పులు చేస్తున్న చూసి చూడనట్లుగా ఉంది. కానీ ఇకముందు ఉపేక్షించే ఛాన్స్ లేదు అన్నట్టు ఉంది టిడిపిలో. ఎందుకంటే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పళ్ళ శ్రీనివాస్ సైతం చేతులెత్తేశారు. అయితే టిడిపి వ్యవహారం చూస్తుంటే మాత్రం.. పిచ్చికుక్క ముద్ర గుర్తుకొస్తుంది. ఏదైనా కుక్కను చంపాలంటే దానిపై పిచ్చికుక్క అనే ముద్ర వేయాలి. రాజకీయాల్లో ఈ ఫార్ములాను ఎక్కువ మంది అనుసరిస్తారు. వీలైనంత ఎక్కువ తప్పులు చేయడం ద్వారా కొలికపూడి శ్రీనివాసరావుకు వివాదాస్పద ముద్ర వేయించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అన్నది ఒక ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే కాక మునుపు కొలికపూడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. దానిని గుర్తించి చంద్రబాబు పిలిచి మరి టిక్కెట్ ఇచ్చారు. కానీ అధినేత నమ్మకాన్ని మాత్రం నిలబెట్టుకోలేకపోయారు కొలికపూడి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
