Kodali Nani And YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అవకాశం ఉన్నంతవరకు కూటమి పార్టీల్లో చేరిపోయారు. అయితే ఆ ఛాన్స్ లేని వారంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయారు. కానీ చాలామంది నేతలు పెద్దగా యాక్టివ్ గా లేరు. గతంలో దూకుడుగా ఉన్న నేతలు సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సైలెంట్ పాటిస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి కొడాలి నాని అయితే రాజకీయాలకు దూరంగా కనిపిస్తున్నారు. అయితే తాజాగా ఆయన జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిశారు. కీలక చర్చలు జరిపారు. దీంతో పార్టీలో కొడాలి నాని యాక్టివ్ అవుతారు అన్న టాక్ వినిపిస్తోంది. గుడివాడలో మాత్రమే కాదు కృష్ణా జిల్లా పార్టీ బాధ్యతలను తీసుకుంటారని తెలుస్తోంది. అదే జరిగితే ఆయన మునుపటి మాదిరిగా దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది.
* ఎన్నికల్లో ఓటమి తర్వాత..
మొన్నటి ఎన్నికల్లో గుడివాడ నుంచి ఐదోసారి పోటీ చేసిన కొడాలి నాని కి భారీ ఓటమి ఎదురయింది. అప్పటివరకు తనను ఓడించే నాయకుడు ఎవడు అంటూ బహిరంగంగానే సవాల్ విసురుతూ వచ్చారు. ముఖ్యంగా చంద్రబాబు తో పాటు లోకేష్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకునేవారు. ఈ క్రమంలో ఆయన నోటి నుంచి వచ్చే బూతులు జుగుప్సాకరంగా ఉండేవి. ఆయన వ్యాఖ్యలను ఎక్కువ మంది తప్పు పట్టేవారు. అయితే ఏపీలో వైసిపి ఓడిపోయి కూటమి రావడంతో కొడాలి నాని కి షాక్ తప్పలేదు. ఆయన అరెస్టు కచ్చితంగా ఉంటుందన్న ప్రచారం నడిచింది. కానీ ఎంత లోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గుండె నొప్పితో ముంబైలోని ఓ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స పొందారు. తరువాత కొద్ది రోజులపాటు హైదరాబాదులోని ఇంటికి పరిమితం అయ్యారు. కోలుకోవడంతో తిరిగి పార్టీలో యాక్టివ్ అవుతారన్న టాక్ వినిపించింది. తాజాగా విదేశీ పర్యటన నుంచి తాడేపల్లి కి చేరుకున్న జగన్మోహన్ రెడ్డిని కలిశారు కొడాలి నాని. వారిద్దరి మధ్య కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
* కూటమిని అడ్డుకోవాలంటే..
ప్రస్తుతం కృష్ణా జిల్లాలో టిడిపి కూటమి బలంగా ఉంది. చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటువంటి సమయంలో సరైన నాయకత్వం అవసరం. అందుకే కొడాలి నానిని జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడినట్లు తెలుస్తోంది. గుడివాడ నియోజకవర్గంలో క్రియాశీలకం కావడంతో పాటు కృష్ణాజిల్లా బాధ్యతలను తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి సూచించారట. మునుపటిలా దూకుడుగా వ్యవహరించాలని ఆదేశించారట. అయితే అందుకు నాని సరేనన్నారట. అయితే అరెస్టు ఉంటుందన్న భయంతో కొడాలి నాని ఉన్నారట. ఎందుకంటే ఆయన స్నేహితుడు వల్లభనేని వంశీ మోహన్ దాదాపు 150 రోజులపాటు జైలు జీవితం అనుభవించారు. అనారోగ్యానికి గురయ్యారు. తనకు అటువంటి పరిస్థితి వస్తుందని కొడాలి నాని కి తెలుసు. అందుకే అధినేత జగన్మోహన్ రెడ్డి సూచిస్తున్నట్టు యాక్టివ్ అవుతారా? లేదా? అనేది చూడాలి.
