Jagan PA Controversy: ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కె. నాగేశ్వర్ రెడ్డి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రైవేట్ పిఎగా ఆయన ఉండేవారు. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు తెలుసు. ఐదేళ్ల వైసిపి పాలనలో జగన్ వెంట నిత్యం కనిపించే వారు కూడా. అయితే ఇప్పుడు ఆయన మద్యం కుంభకోణం కేసులో నిందితుడు. తనిఖీల్లో ఆయనకు సంబంధించి వందల కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయి. ఆయన చూస్తే ఓ సాధారణ ఉద్యోగి. కానీ సంపాదన చూస్తే వందల కోట్లలో కనిపించింది. దీంతో ఆయన చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. అయితే ఇప్పుడు ఆయన జగన్ పిఏ కాదు అని సాక్షి మీడియాలో ఒక కథనం వచ్చింది. ఒక పొలిటికల్ అసిస్టెంట్ గా అందులో పేర్కొన్నారు. అయితే ఆయన పిఏ అని అందరికీ తెలుసు. ఆ మాట చెప్పేందుకు ఇప్పుడు ఆ సెక్షన్ మీడియా ముందుకు రావడం లేదు.
* సూరీడును కాదనుకొని..
నాగేశ్వర్ రెడ్డి వ్యక్తిగత పీఏగా జగన్మోహన్ రెడ్డికి సేవలు అందించారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి కి సూరీడు మాదిరిగా అన్నమాట. దాదాపు ఆరు సంవత్సరాల పాటు సీఎం వద్ద వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న సూరీడు బాగానే వెనుకేసుకున్నారు. భారీ స్థాయిలో సంపాదించుకున్నారు. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్లను సైతం శాసించారని అప్పట్లో ఒక ప్రచారం ఉండేది. అక్రమంగా భారీగా సంపాదించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి సూరీడును దూరం పెట్టారు. నాగేశ్వర్ రెడ్డిని దగ్గరకు చేర్చుకున్నారు. వాస్తవానికి నాగేశ్వర్ రెడ్డి సాక్షిలో ఒక చిరుద్యోగి ఆట. ఆయన కుటుంబం ఒక టిఫిన్ దుకాణం నడుపుకునేదట. అటువంటి నాగేశ్వర్ రెడ్డి గత ఐదేళ్లలో వందల కోట్ల ఆస్తులకు పడగలెత్తడం ఏమిటనేది ఇప్పుడు ప్రశ్న.
* తీవ్ర మనస్థాపం..
అయితే ఇన్నాళ్లు జగన్మోహన్ రెడ్డికి సేవలు అందించారు. చాలా నమ్మకస్తుడిగా ఉండేవారు. ఇప్పుడు ఉన్నట్టుండి నాగేశ్వర్ రెడ్డి అంటే ఎవరు అన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వందల కోట్ల బినామీ ఆస్తులతో అడ్డంగా బుక్కైన ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నారని బయట ప్రచారం నడుస్తోంది. ఆయన అప్రూవర్ గా మారే అవకాశం ఉన్నట్లు కూడా ఒక టాక్ అయితే మాత్రం బయటకు వచ్చింది. అందుకే జగన్మోహన్ రెడ్డి తో పాటు అనుకూల మీడియా స్వరం పూర్తిగా మారిపోయింది. సాక్షిలో ఏకంగా కేఎన్ఆర్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి పీఏ కాదని.. పొలిటికల్ అసిస్టెంట్ మాత్రమేనని చెప్పడం చూస్తుంటే మాత్రం దీని వెనుక ఉన్న అసలు నిజం బయటకు తెలిసిపోతోంది.
