Kapu Ramachandra Reddy: ఏపీ బీజేపీలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాకతో ఒక రకమైన మార్పు కనిపిస్తోంది. ఆ పార్టీలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైసీపీలోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బిజెపి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. రాయలసీమకు చెందిన కాపు రామచంద్రారెడ్డి రాజ్ నాథ్ సింగ్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. త్వరలో ఆయన బిజెపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. త్వరలో టిడిపి, జనసేనతో బిజెపి సీట్ల సర్దుబాటు ప్రారంభమౌతుందనగా.. వైసీపీలోని అసంతృప్త ఎమ్మెల్యేలు బిజెపి బాటపడుతుండడం గమనార్హం.
కాపు రామచంద్రారెడ్డి సీనియర్ నాయకుడు. సీఎం జగన్ కు నమ్మిన బంటు. కానీ జగన్ ఆయనకు టికెట్ నిరాకరించారు. తనకు సీటు ఇవ్వకపోవడంపై సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గరే రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నీకు గుడ్ బై అంటూ సీఎం క్యాంప్ కార్యాలయానికి సెల్యూట్ చేశారు. జగన్ నమ్ముకుని వచ్చినందుకు తమ జీవితాలు నాశనం అయ్యాయని వాపోయారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. షర్మిల పిసిసి పగ్గాలు అందుకోవడంతో ఆమె వెంట నడుస్తారని టాక్ నడిచింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఆశీర్వాదం తీసుకోవడంతో.. కాంగ్రెస్ లో చేరిక లాంఛనమేనని ప్రచారం జరిగింది.కానీ ఎందుకో ఆ పార్టీలో చేరలేదు.
కొద్దిరోజుల కిందట కాపు రామచంద్రారెడ్డి మెత్తబడినట్లు వార్తలు వచ్చాయి. తిరిగి ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆయన వ్యాఖ్యానాలు కొనసాగాయి. జగన్ పై తాను విమర్శలు చేయనని కూడా ఆయన చెప్పుకొచ్చారు. వ్యతిరేక ప్రచారం చేయనని కూడా అన్నారు. అయితే ఈరోజు విశాఖ పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్ కు కాపు రామచంద్రారెడ్డి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పురందేశ్వరి దగ్గరుండి ఆయనను కేంద్రమంత్రి తో కలిపించారు. ఆయన కుటుంబ సమేతంగా వచ్చి కలవడంతో.. తప్పకుండా బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలుగుదేశం, జనసేనల మధ్య పొత్తు కుదిరింది. బిజెపి సైతం కూటమిలోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో వైసిపిలో టిక్కెట్ దక్కని చాలామంది నాయకులు బిజెపికి టచ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే బిజెపిలో ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. అందుకే బిజెపి అగ్రనేతలు ఎవరికీ హామీ ఇవ్వడం లేదు. కానీ పొత్తు వ్యవహారం తేలాక చేరికలపై బీజేపీ దృష్టి పెట్టి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కాపు రామచంద్రారెడ్డి చేరిక విషయంపై ఒకటి, రెండు రోజుల్లో క్లారిటీ రానున్నట్లు సమాచారం.