Duvvada Srinivas: తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీ జంట అంటే ముందుగా గుర్తొచ్చేది దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. ఈ జంట నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. అయితే మాధురితో వ్యవహారంతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వేటు వేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. అయితే తిరిగి వైసిపిలో చేరి తానేంటో నిరూపిస్తానని దువ్వాడ శ్రీనివాస్ శపధం చేశారు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గానే పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి వర్క్ అవుట్ కావడం లేదని అర్థం అవుతోంది. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి తేవాలని ప్రయత్నాల్లో ఉన్నట్లు అర్థం అవుతోంది. కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం ద్వారా.. జగన్మోహన్ రెడ్డి విషయంలో పరోక్ష సంకేతాలు ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్. అంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తే.. కొత్త పార్టీ పెడితే కచ్చితంగా అధికారంలోకి వస్తారని దువ్వాడ శ్రీనివాస్ తో పాటు దివ్వెల మాధురి చెబుతున్నారు. కచ్చితంగా ఆ పార్టీలో చేరుతామని కూడా చెప్పుకొస్తున్నారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వారికి తలుపులు మూసివేసారని అర్థం అవుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని వారు పరోక్ష సంకేతాలు ఇచ్చినట్లు అయింది.
* వైసీపీ నుంచి వేటు
వ్యక్తిగత కుటుంబ వ్యవహారంతో దువ్వాడ శ్రీనివాస్ పై వేటు పడింది. దివ్వెల మాధురితో ఆయన సంబంధం వివాదానికి దారితీసింది. నాటకీయ పరిణామాల నడుమ ఆయనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వేటు వేసింది. అయినా సరే తిరిగి వైసీపీలో చేరి సత్తా చాటుతానని గట్టిగానే చెబుతూ వచ్చారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుంచి ఆశించిన స్థాయిలో సానుకూలత రాలేదు. అయితే ఇటీవల మళ్ళీ ఇంటర్వ్యూలు ఇస్తున్న దువ్వాడ శ్రీనివాస్ తన లైఫ్ .. తమిళనాడు సీఎం విజయ్ తో పోలిక ఉందని బాహటంగా ప్రకటించుకున్నారు. పనిలో పనిగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే సీఎం అవుతారని తేల్చి చెప్పారు. ఆ పార్టీలో తనతో పాటు మాధురి కూడా చేరుతుందని ప్రకటించారు.
* రాజకీయాలకు దూరంగా..
ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. తన పని తాను చేసుకుంటున్నారు. పాన్ ఇండియా స్థాయి సినిమాలు చేస్తూ విపరీతమైన స్టార్ డం ను సొంతం చేసుకునే పనిలో ఉన్నారు. మొన్న తమిళనాడులో విజయ్ గెలిచిన తర్వాత.. జూనియర్ ఎన్టీఆర్ పైనే అంతటా ప్రచారం నడిచింది. తరువాత ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ తన ప్రభావం చూపుతారని ఆ ప్రచార సారాంశం. సరిగ్గా ఇదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్ తమిళనాడు విజయ్ జీవితాన్ని తన జీవితంతో పోల్చుకున్నారు. ఇప్పుడు ఎక్కడో సినిమాలు చేసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు.. ఆయన అధికారంలోకి వచ్చేస్తున్నారంటూ.. ఆ పార్టీలో చేరుతానంటూ ఇలా విభిన్న ప్రకటనలు చేస్తున్నారు. అయితే అది సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకునేందుకే కానీ.. అందులో ఎంత మాత్రం నిజం లేదని కొట్టిపారేస్తున్న వారు ఉన్నారు. అయితే ఇప్పటివరకు దువ్వాడ శ్రీనివాసును సాఫ్ట్ కార్నర్ తో చూసారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. కానీ ఇప్పుడు ఆయన దృష్టి జూనియర్ ఎన్టీఆర్ పై పడడంపై మాత్రం తప్పుపడుతున్నారు.
