Janasena Party: రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. అయితే ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అనుకున్న స్థాయిలో దూకుడు కనబరచడం లేదు. అయితే కూటమి విచ్ఛిన్నం అయితే తప్ప అధికారంలోకి రావడం దాదాపు అసాధ్యమని జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టమైన నేతలు హెచ్చరిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి నేతలు అయితే కుండబద్దలు కొట్టి చెప్పారు. విజయసాయిరెడ్డి సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడు పార్టీలు కలిసి ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అసాధ్యమని తేల్చి చెప్పారు. అందుకే ఇప్పుడు కూటమి విచ్చిన్నం పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది. ఒక పద్ధతి ప్రకారం జనసేన, టిడిపి మధ్య విభేదాలు వెలుగు చూస్తున్నాయి. అవి కూడా ప్రధాన నియోజకవర్గాల్లో కావడం గమనార్హం. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు కూటమి గమనించకపోతే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే కూటమి పార్టీలో చేరిన వైసీపీ నేతలతోనే ఇప్పుడు ఆ పని చేయిస్తోందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం.
* కొట్టుకున్నంత పని..
తాజాగా పిఠాపురం( Pithapuram ) వివాదం రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబు కు ప్రోటోకాల్ ప్రకారం గౌరవించడం లేదన్నది టిడిపి ఇన్చార్జ్ వర్మ అభిప్రాయం. దానిపై ఆయన తరచూ అడుగుతున్నారు కూడా. అయితే ఇప్పటివరకు ఒక ఎత్తు సాగింది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెండెం దొరబాబు జనసేనలో చేరిన తర్వాత ఇంకోలా ఉంది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత దొరబాబు జనసేనలో చేరారు. కానీ చాలా ఏళ్లుగా ఆయన వర్మకు ప్రత్యర్థి. అలా ఆయన జనసేనలో చేరే సరికి ఇద్దరి మధ్య గట్టిగానే ఆధిపత్య పోరు ప్రారంభం అయింది. ఇద్దరి మధ్య గట్టి వాదనలే జరిగాయి. కానీ దొరబాబు జనసేనలో చేరిక వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ ప్రోత్సాహం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
* చీలిక తేవాలన్న ప్రయత్నం
కూటమి మరో 15 ఏళ్ల పాటు ఉండాలని పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan ) కోరుకుంటున్నారు. చంద్రబాబు సైతం కిందిస్థాయిలో సర్దుబాట్లు తప్పవని సూచిస్తున్నారు. కానీ వైసిపి హయాంలో ఐదేళ్లపాటు ఎవరితో నైతే ఇబ్బంది పడ్డారో..అటువంటి వారు ఇప్పుడు అజమాయిసి చేస్తుండడాన్ని తట్టుకోలేకపోతున్నారు టిడిపి శ్రేణులు. అయితే జనసేనలో చేరిన వైసిపి నేతలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి విషయంలో ఒక కన్నేసి ఉంచకపోతే అది అంతిమంగా కూటమికే నష్టం. చాలామంది వైసిపి నేతలు జనసేనలోకి వచ్చారు. వారు ఇప్పుడు కూటమిలో చీలికకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిని ధీటుగా నియంత్రించాల్సిన అవసరం మాత్రం కూటమి పార్టీలపై ఉంది.