Jana Sena Party expansion: జనసేన( janasena ) నాయకత్వం ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తోంది. ఏపీలో కూటమిపరంగా అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. పార్టీ విస్తరణ పై సరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కేరళలో ఆ పార్టీ విస్తరణ జరిగింది. ఆ రాష్ట్రంలో వివిధ పార్టీల్లోని 200 మంది నేతలు జనసేనలో చేరడం విశేషం. జనసేన అగ్ర నేతలు నాగబాబు, రామ్ తాళ్లూరిల సమక్షంలో కేరళలో జనసేనలో చేరికలు పెరిగాయి. కేరళ నుంచి వచ్చిన వినతులు మేరకు పవన్ కళ్యాణ్ స్పందించారు. నాగబాబు తో పాటు రామ్ తాల్లూరిలను అక్కడకు పంపించారు. అయితే కేరళలో పెద్ద ఎత్తున నేతలు జనసేనలో చేరడం ఇప్పుడు కొత్త ప్రచారానికి తెరతీసింది. మున్ముందు జనసేన రాజకీయ ప్రయాణం దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించనుందని అర్థమవుతోంది.
సిద్ధాంతపరంగా ప్రజల్లోకి.
పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) ఎప్పుడు దూకుడు రాజకీయాలు చేయలేదు. జనసేన పరంగా దూకుడుగా అడుగులు వేయలేదు. ముందుగా ఏపీలో సిద్ధాంత పరంగా ముందుకు వెళ్లారు. సంప్రదాయ రాజకీయ పార్టీ మాదిరిగా అస్సలు వ్యవహరించలేదు. తమ పార్టీ సిద్ధాంతాలు నచ్చితేనే కొనసాగాలని కుండబద్దలు కొట్టారు నాయకులకు. భారతీయ జనతా పార్టీ మాదిరిగా సిద్ధాంత పరంగా జనసేనను నిలబెట్టాలని చూశారు. ఈ క్రమంలో హిందుత్వ వాదాన్ని, సనాతన ధర్మ పరిరక్షణ నినాదాన్ని అందుకున్నారు. దీని వెనుక లోతైన వ్యూహం ఉంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. కానీ బలమైన సిద్ధాంతాల నడుమ అవి కొనసాగుతున్నాయి. తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతం పూర్తిగా రాజకీయ పార్టీలను కబలించింది. అటువంటి చోట సనాతన ధర్మం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి.. ఒక వర్గం ప్రజలను ఆకర్షించగలిగారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అదే వ్యూహంతో దక్షిణాది రాష్ట్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇప్పుడు కేరళలో అది వర్క్ అవుట్ అయ్యేలా కనిపిస్తోంది.
- పెద్ద ఎత్తున నేతల చేరిక.. తిరువనంతపురంలో( Thiruvananthapuram ) జరిగిన జనసేన సమావేశంలో చాలామంది నేతలు ఆ పార్టీలో చేరారు. ప్రధానంగా నేషనల్ లేబర్ పార్టీ, హిందుస్థాన్ అవామీ మోర్చా, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్, కాంగ్రెస్ పార్టీల నుంచి 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. అయితే ఈ ఉత్సాహం చూస్తుంటే మాత్రం తదుపరి లక్ష్యంగా కర్ణాటక పై దృష్టి పెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. క్రమేపి తమిళనాడుతో పాటు తెలంగాణలో కూడా పార్టీ విస్తరించి.. జాతీయ పార్టీగా అవతరించే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ భావజాలం భాషలతో పాటు ప్రాంతాలకు అతీతంగా దేశస్థాయిలో ప్రజలను ఆకట్టుకుంటుందని జనసేన నాయకత్వం భావిస్తోంది. చూడాలి మరి ఆ పార్టీ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో..