Jana Sena Rajya Sabha Seat: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా మొండితనం ప్రదర్శిస్తారు. ఎవరైనా రెచ్చగొడితే ఆయన రెచ్చిపోరు. చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకు పోతారు. తన పనితోనే వారికి ధీటైన సమాధానం చెబుతారు. మొన్న రాజమండ్రిలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చాలా అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ముందుగా కాపు అనే అంశంపై స్పష్టతనిచ్చే క్రమంలో.. తాను కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తానని.. నాదెండ్ల మనోహర్ కు ఎలా ప్రాధాన్యం ఇస్తారని.. లింగమనేని రమేష్ ను ఎందుకు చేరదీస్తున్నారని చాలామంది కాపు నేతలు తనను ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు పవన్. నేను కష్టంలో ఉండగా అండగా నిలిచింది వారు అని.. 2019లో ఎన్నికల్లో పోటీ చేస్తే ఇప్పుడు మాట్లాడుతున్న కాపు నేతలు ఏమయ్యారు అని ప్రశ్నించడం ద్వారా కొన్ని రకాల సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా రాజ్యసభ పదవి లింగమనేని రమేష్ కు అని తేల్చేశారు. రాజమండ్రి సభను అలా వాడుకున్నారు. నా ఇష్టం పార్టీని ఇలానే నడుపుతాను.. తనకు కష్టంలో అండగా నిలిచిన వారికి ప్రాధాన్యం ఇస్తానని తేల్చి చెప్పారు పవన్.
* కాపు నేతల విమర్శలు..
ఇటీవల జనసేనపై కాపు నేతలు విమర్శలు చేస్తున్నారు. కాపు ముసుగులో పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాపులు ఓట్లు వేసి జనసేన ను గెలిపిస్తే ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనికి గట్టిగానే బదులు ఇచ్చారు పవన్. 2019లో పోటీ చేస్తే తనకు అసలు అండగా నిలబడలేదు కాపు నేతలు అని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అండగా నిలిచిన వారికి తాను అండగా నిలబడతానని తేల్చి చెప్పారు. అయితే ఇదంతా రాజ్యసభ పదవి కోసమే అని తేలిపోయింది. ఇప్పటికే జనసేనలో నెంబర్ 2 గా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. 2018లో వైసీపీలోకి వెళ్లకుండా జనసేనలో చేరారు. అప్పటికే వైసీపీ నుంచి ఆయనకు ఆహ్వానం ఉంది. కానీ పవన్ పై ఇష్టంతో ఆయన చేసే రాజకీయాలకు జై కొట్టారు. అప్పట్లో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగించారు. అప్పుడు ఏ కాపు నేత అభ్యంతరం వ్యక్తం చేయలేదు. 2019లో అదే నాదెండ్ల మనోహర్ కు టికెట్ ఇస్తే ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. 2024లో గెలిచి మంత్రిగా అవకాశం కల్పించేసరికి మాత్రం పవన్ కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు.
* ఓటమిలో సైతం మద్దతు..
వాస్తవానికి జనసేన ఓడిపోతుంది అని తెలిసినా మద్దతు తెలిపింది నాదెండ్ల మనోహర్. ఆర్థికంగా అండగా నిలిచింది లింగమనేని రమేష్. దానిని కాపు ముసుగులో చూపి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్న వారు అధికమవుతున్నారు. అటువంటి వారికి గట్టి సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్. అలా చెప్పడం ద్వారా లింగమనేని రమేష్ అభ్యర్థిత్వాన్ని రాజ్యసభకు ఖరారు చేస్తారని తెలుస్తోంది. అయితే ఇటీవల కాపులకు రాజ్యసభ పదవి ఇవ్వాలని పవన్ పై డిమాండ్ పెరుగుతోంది. కానీ అందుకు తలొగ్గే ఛాన్స్ లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేనకు ఒక రాజ్యసభ పదవి రావడం ఖాయం. లింగమనేని రమేష్ పేరు దాదాపు ఖరారు చేయడం ఖాయమైపోయిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే కమ్మ సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్నారన్న విమర్శల కు సైతం పవన్ పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం.
