Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగన్ ప్రమాణ స్వీకార ఆహార మెనూ

YS Jagan: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగన్ ప్రమాణ స్వీకార ఆహార మెనూ

YS Jagan: వైసీపీలో కొందరు చేస్తున్న అతి ఆ పార్టీ కొంపముంచేలా ఉంది. గెలుపు పై ధీమా ఉండవచ్చు కానీ.. అతి ధీమా మాత్రం ఉండకూడదు. అదే కొన్నిసార్లు ఇబ్బందులు తెచ్చి పెడుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీఎన్నికల సమయంలో సైతం ఇదే మాదిరిగా వ్యవహరించింది వైసిపి. కానీ బొక్క బోర్లా పడింది. అయితే ఈసారిపోలింగ్ ముగిసిన రెండు రోజుల తర్వాత సీఎం జగన్ ఒక ప్రకటన చేశారు. గత ఎన్నికల కంటే అదనంగా సీట్లు గెలుస్తామని చెప్పారు. ఒక పార్టీ అధినేతగా.. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు.. ఆ విధంగా చెప్పి ఉండవచ్చు.  కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఉందా? వైసిపి ఏకపక్షంగా గెలిచే ఛాన్స్ కనిపిస్తోందా? అన్నది మాత్రం వైసిపి నేతలు ఆలోచించడం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఓటింగ్ శాతం పెరిగింది. సాధారణంగా ఇది అధికార పార్టీకి ప్రమాదకరం. కానీ అవేవీ పట్టించుకోకుండా  వైసీపీ నేతల్లో కొంతమంది అతి చేస్తున్నారు.
వైసీపీలో పేరు మోసిన నాయకులంతా సైలెంట్ గా ఉన్నారు. ఒకరిద్దరు మాత్రం హడావిడి చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తేనె తుట్టను కదిపినట్టు.. సీఎం జగన్ ప్రమాణస్వీకారం పై మాట్లాడారు.జూన్ 9న విశాఖలోప్రమాణస్వీకారం చేస్తారని ప్రకటించారు.అటు తరువాత వైవి సుబ్బారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి సైతం పొడిపొడిగా మాట్లాడి వెళ్లిపోయారు. మిగతా కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకులు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఉత్తరాంధ్ర నాయకులు మాత్రం హడావిడి చేస్తున్నారు. అయితే తొందరపాటుతో చేసే తప్పులు తరువాత ఎంత తీరిగ్గా బాధపడినా.. జరిగిన డ్యామేజ్ను తగ్గించలేని పరిస్థితి ఉంటుంది.
 ఈ విషయంలో తెలుగుదేశం కూటమి జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. కౌంటింగ్ విషయంలో ఎటువంటి తొందరపాటు మాటలు వద్దని.. సంయమనం పాటించాలని పార్టీ శ్రేణులను సూచిస్తోంది. ప్రత్యర్థులు ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగిన ప్రతిస్పందించవద్దని మెగా బ్రదర్ నాగబాబు జనసైనికులకు ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. అదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ ను నమ్మవద్దని.. నమ్మి చేతులు కాల్చుకోవద్దని.. పరోక్షంగా బెట్టింగులు కట్టవద్దని టిడిపి శ్రేణులకు అంతర్గతంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ శ్రేణులు కొంతమంది అతి చేస్తున్నారు. తాము గెలుస్తామని చెప్పడం ఒక వంతు.. కానీ కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారని.. మంగళగిరిలో లోకేష్ పని అయిపోయిందని.. పిఠాపురంలో పవన్  చాలా ఓట్లతో ఓడిపోతున్నారని ప్రచారం చేస్తున్నారు. ఫలితాలు ఇలా ఉంటాయని అంచనా వేయవచ్చు కానీ.. వైసీపీ శ్రేణులు మాత్రం ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళుతున్నాయి.
జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం ప్రకటన వ్యూహాత్మకం అయి ఉండొచ్చు.కానీ వైసీపీ శ్రేణులు,జగన్ అభిమానులు అంతటితో ఆగడం లేదు.ఆరోజు వైసిపి అభిమానులకు ఉదయం వేళలో వడ్డించే బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం వడ్డించే లంచ్ కు సంబంధించిన మెనూ కూడా సిద్ధమంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఉత్సాహంగా గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆలు లేదు చులులేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు పరిస్థితి ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
 అల్పాహారంలో మసాలా ఇడ్లీ,ఎమ్మెల్యే పెసరట్టు,జీడిపప్పు ఉప్మా, పులిహోర, పెరుగు వడ,సాంబారు వడ,మసాలా దోశ, చాక్లెట్ దోశ, చక్కర పొంగల్, పాయసం, పోహ వేపుడు, బొబ్బట్లు, పునుగులు మెనూ గా చెబుతున్నారు. ఇక నాన్ వెజిటేరియన్ బ్రేక్ ఫాస్ట్ కు సంబంధించి.. చికెన్ పెసరట్టు ఎగ్ దోస చికెన్ దోస మటన్ ఖీమా దోశ, ఎగ్ బుర్జి విత్ పాప్, మటన్ కీమా ఇడ్లీ, చికెన్ పొంగల్, అరిసెలు, బోటి వడ, నాటుకోడి పులుసు పెసర పునుగులు, మద్రాస్ ఫిల్టర్ కాపీ, ఆరెంజ్ జ్యూస్, కోకోనట్ వాటర్.. ఇదిబ్రేక్ ఫాస్ట్ మెనూ.
 ఇక లంచ్ మెనూకి సంబంధించి.. వెజిటేరియన్ లో గోంగూర పప్పు, బెండకాయ పులుసు, వంకాయ పచ్చడి, మామిడికాయ పప్పు, వెజిటేబుల్ బిర్యాని, టమోటా పప్పు, గుత్తి వంకాయ కూర, ఉలవచారు, ఆంధ్ర ఆవకాయ, దొండకాయ ఫ్రై, ఆలు కుర్మా, సాంబారు, రసం, కర్డ్ రైస్,పూతరేకులు, బూంది లడ్డు.  ఇక నాన్ వెజ్ ఐటమ్స్ కు సంబంధించి.. ఆంధ్ర చికెన్ కర్రీ, మటన్ పులావ్, చేపల పులుసు, బొమ్మిడాల పులుసు, నాటుకోడి వేపుడు, టైగర్ రొయ్యల ఇగురు, గోంగూర మటన్, కోనాము ఫిష్, చికెన్ బిర్యాని, నాటుకోడి పులుసు, నాటుకోడి చిట్టి ముత్యాల బిరియాని, నాటుకోడి రాగిసంకటి, ఎగ్ మసాలా కర్రీ, బేవరేజెస్ ఫోర్ లంచ్, స్పైస్ బట్టర్ మిల్క్, మ్యాంగో లస్సి, ప్రెస్ లైమ్ సోడా, తీపి చెక్కలు, బెల్లం జిలేబీలు, బెల్లం లడ్డూలు, తీపి బూంది మిక్చర్, మాడుగుల హల్వా, కాకినాడ కాజా, తాపేశ్వరం కాజాలు, పది రకాల ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ సలాడ్, కలకత్తా ఆకుతో స్పెషల్ చాక్లెట్ పాన్.. అంటూ మెనూ ప్రకటించారు. ఆహార విభాగం చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి పేరిట సోషల్ మీడియాలో ఈ మెనూ హల్చల్ చేస్తోంది. అయితే ఈ అతి ప్రచారం వైసిపి కొంపముంచుతుందని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు.
NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version