Polavaram : పోలవరం ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా జగనన్న

పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు జేబు సంస్థ అని విమర్శలు చేసిన వారు సైతం ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. మొత్తానికైతే ఎన్నికల ముంగిట ఏపీ జీవనాడి జగన్ సర్కారుకు గుర్తొచ్చిందన్న మాట.

Written By: Dharma, Updated On : July 13, 2023 5:24 pm
Follow us on

Polavaram : ఏపీ జీవనాడి పోలవరం..ఇది ప్రజల్లో ఉండే నినాదం మాత్రమే. వైసీపీ సర్కారుకు ఈ భావన లేదనే చెప్పుకోవచ్చు. లేకుంటే ఈ నాలుగేళ్లు అంతులేని విధంగా ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. అసలు నిర్మాణం జరుగుతుందా? లేదా? అని పట్టించుకున్న దాఖలాలు లేవు. నెలకు ఒక రోజు వచ్చి సమీక్షిస్తానని ప్రమాణస్వీకారం నాడు చెప్పిన సీఎం జగన్..ఇప్పటివరకూ ప్రాజెక్టును పరిశీలించింది కేవలం ఆరే ఆరు సార్లు.  భారీ పోలీస్ బలగాల నడుమ పర్యటించడం.. తరువాత ప్రాజెక్టు గురించి మరిచిపోవడం పరిపాటిగా మారింది. ఇప్పుడు ఎన్నికలకు ఒక ఏడాది ఉండడంతో పోలవరం ప్రాజెక్టుపై సీరియస్ గా దృష్టిసారిస్తున్నట్టు చెబుతున్నారు.

పోలవరం విషయంలో ఏపీ సర్కారు చెబుతున్నదానికి.. కేంద్ర చెబుతున్న లెక్కలకు అస్సలు పొంతన ఉండడం లేదు. ఇటీవల ప్రాజెక్టు నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం రూ.12,911 కోట్లు మాత్రమే ఇస్తామని తేల్చిచెప్పింది. అంతకు మించి ఇవ్వలేమని చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి. రూ.55,548 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని జగన్ సర్కారు చెబుతూ వస్తోంది. అయితే కేంద్రం తాజాగా చేసిన ప్రకటనపై రాష్ట్ర పెద్దలు ఎవరూ స్పందించలేదు. దీంతో ఎలా ముందుకెళ్లాలో తెలియడం లేదు.

ప్రాజెక్టు నిర్మాణంలో డయాఫ్రం వాల్ కీలకం. భూమి నుంచి నిర్మాణం చేపట్టాలి. టీడీపీ హయాంలో డయాఫ్రం వాల్ నిర్మాణ బాధ్యతను జర్మనీకి చెందిన బావర్ అనే సంస్థకు అప్పగించారు. కొంతవరకూ నిర్మాణం కూడా పూర్తయ్యింది. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ ప్రాజెక్టును సందర్శించారు. అస్సలు డయా ఫ్రం వాల్ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఒక తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత బావర్ సంస్థను రివర్స్ టెండరింగ్ లో భాగంగా తరిమేశారు. ఎత్తిపోతల పథకంలో మోటార్లను అమర్చడంలో అనుభవం ఉన్న మెగా కంపెనీకు అప్పగించారు.

డయాఫ్రం వాల్ నిర్మాణంలో ఏం చేయాలో తెలియని మెగా సంస్థ బిక్కముఖం వేసుకొని ఉండిపోయింది. దీంతో కీలక నిర్మాణం ఎక్కడిదక్కడే నిలిచిపోయింది. డయాఫ్రం వరాల్ రెండు, మూడుచోట్ల దెబ్బతిన్నది. అది బాగు చేయడం సమస్యగా మారింది. ఏదో ఒకటి చేయాలంటే మేఘాకు చేతకాదు. చివరికి బావర్ సంస్థనే ప్రభుత్వం సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. రిపేర్లు చేయాలని.. మిగిలిన పనులు పూర్తి చేయాలని అడుగుతున్నారు. మొత్తంగా రూ. ఎనిమిది వందల కోట్ల పనులను వారికి అప్పగించనున్నారు. మరి మేఘాకు కాంట్రాక్ట్ ఎందుకు.. కమిషన్ల కోసమా అన్నది తేలాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు జేబు సంస్థ అని విమర్శలు చేసిన వారు సైతం ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. మొత్తానికైతే ఎన్నికల ముంగిట ఏపీ జీవనాడి జగన్ సర్కారుకు గుర్తొచ్చిందన్న మాట.