Jagan Press Meet: ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో అసెంబ్లీకి హాజరు కావడం లేదు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. కేవలం 11 స్థానాలు మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రావడంతో నిబంధనల మేరకు ప్రతిపక్ష హోదా రాదు. అదే విషయాన్ని ప్రభుత్వం తో పాటు స్పీకర్ తేల్చి చెప్పారు. అయితే తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలో అడుగుపెట్టి ప్రజా సమస్యలు ప్రస్తావిస్తానని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఆ అవకాశం లేకపోవడంతో వారాంతపు కామెంట్స్ అంటూ.. తాడేపల్లి లో ప్రెస్ మీట్ పెట్టి సమకాలీన రాజకీయ అంశాలపై మాట్లాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తున్నారు. అయితే ఇప్పుడు జగన్ అలా ప్రెస్ మీట్ పెడితే చాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బెదిరిపోతున్నాయి. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతున్నారు. ఆయన మాటల్లో తప్పిదాలు చోటు చేసుకోవడంతో.. రీల్స్, మీమ్స్ తో హోరెత్తిపోతోంది సోషల్ మీడియా..
* అప్పట్లో మీడియాకు దూరంగా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. మీడియాతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. దీంతో ఆయనతో మాట్లాడేందుకు మీడియా చేయని ప్రయత్నం అంటూ ఉండేది కాదు. చివరకు ఢిల్లీ పర్యటన సమయంలో సైతం జగన్మోహన్ రెడ్డి మీడియాను దగ్గరకు రానిచ్చేవారు కాదు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చెప్పాలి అనుకుంటే.. రికార్డెడ్ తో కూడిన వీడియోను విడుదల చేసేవారు. వాటినే సాక్షితోపాటు మిగతా మీడియాకు విడుదల చేసేవారు. దీంతో అంతా జగన్మోహన్ రెడ్డి వాగ్దాటి గల మనిషి అని భావించేవారు. ఎటువంటి తత్తర పాటు లేకుండా మాట్లాడేవారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఏ మీడియాతో మాట్లాడే వారు కాదో.. అదే మీడియాతో వారాంతపు సమావేశాలు నిర్వహించి రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తున్నారు. అయితే ఆ వైఫల్యాలు ప్రజల్లోకి వెళ్తున్నాయో లేదో చెప్పలేం కానీ.. ఆయన మాత్రం సోషల్ మీడియాలో టార్గెట్ అవుతున్నారు.
* గతంలో లోకేష్ కు..
గతంలో మంత్రి నారా లోకేష్ ను అలానే వెంటాడే వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు. అయితే ఇప్పుడు వెంటాడకుండానే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి సోషల్ మీడియాకు అవసరమైన వనరులను అందిస్తున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని బెంగళూరు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈవారం తాడేపల్లి కి వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తిరిగి బెంగళూరు వెళ్ళిపోనున్నారు. దీంతో రెడీగా ఉన్నారు సోషల్ మీడియా యాక్టివిస్టులు. ఆయన రెండు గంటలపాటు ఏకధాటిగా మీడియా సమావేశంలో పాల్గొంటూ వస్తున్నారు. కానీ ఏదో ఒకటి తప్పుడుగా మాట్లాడి బుక్ అవుతున్నారు. మరి ఈరోజు ఎలాంటి తప్పుడు మాటలు వెలుగు చూస్తాయో చూడాలి.
