YS Jagan: కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేయనున్నారా? ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి తో రాజీనామా చేయించుకున్నారా? ఉప ఎన్నికకు వెళ్లి తాను ఎంపీ కావాలని చూస్తున్నారా? ఢిల్లీలో మారుతున్న పరిణామాలతోనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తనను బలి పశువు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన గుర్తించి.. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరం అనుకుంటే తిరుగుబాటు చేసి బిజెపిలోకి వెళ్తారని కూడా పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్ నడుస్తోంది.
* పాత కేసులు తెరపైకి..
ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పై ఉన్న పాత కేసులు తెరపైకి వస్తున్నాయి. అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై ఉన్నారు. 2012లో బెయిల్ లభించడంతో అప్పటినుంచి ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చారు. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు ప్రతి వారం సిబిఐ కోర్టుకు హాజరై సంతకం చేసేవారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పై ఉన్న అక్రమాస్తుల కేసులకు సంబంధించి విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే జగన్మోహన్ రెడ్డికి చిక్కులు తప్పవు. ఈ తరుణంలో ఎంపీగా దేశ రాజధాని లో ఉంటే కేసుల తీవ్రత తగ్గించుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
* వివేకా హత్య కేసు..
ఇంకోవైపు వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా వెంటాడుతోంది. మొన్నటి ఎన్నికల్లో విపరీతమైన ప్రభావం చూపింది. కడప జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు కూటమి గెలుచుకుంది. మూడు అసెంబ్లీ సీట్లతో పాటు ఒక ఎంపీ సీట్లు మాత్రమే వైసిపి గెలుచుకోగలిగింది. కడప పార్లమెంటు స్థానంలో మెజారిటీ గణనీయంగా పడిపోయింది. అందుకే వచ్చే ఎన్నికల్లో మరోసారి అవినాష్ బరిలో దించితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా అవినాష్ రెడ్డి తో రాజీనామా చేయించి.. ఆయన స్థానంలో ఎంపీ కావాలని జగన్ భావిస్తున్నారు. తన కేసుల తీవ్రతను తగ్గించుకోవాలని చూస్తున్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో అవినాష్ ను తప్పించి తన భార్య భారతి రెడ్డిని అక్కడ గెలిపించుకోవాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలన్నీ తెలిసి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారని.. అవసరం అనుకుంటే తిరుగుబాటు చేసి బిజెపిలో చేరుతారని కూడా కడప పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
