Jagan new capital plan Mavigun: నలుగురికి నచ్చినది.. నాకు అసలు నచ్చదు.. ఇది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) వైఖరి. అమరావతి రాజధాని విషయంలో ఆయన అనుసరించిన వైఖరి అందరికీ తెలిసినదే. అయితే ఇప్పుడు అదే అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పిస్తే.. ఇప్పుడు సరికొత్త కామెడీ మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి. సోషల్ మీడియా మీమ్స్, ట్రోల్స్ కు కావాల్సినంత మెటీరియల్ అందించారు. పార్లమెంట్ సమావేశాలకు సమాంతరంగా ప్రెస్ మీట్ పెట్టి కొత్త కొత్త అంశాలను ప్రకటించారు. ఇప్పటివరకు మూడు రాజధానులు అని చెప్పిన ఆయన.. ఇప్పుడు కొత్తగా మరో రాజధాని కట్టాలని ప్రతిపాదించారు. మచిలీపట్నం- విజయవాడ- గుంటూరు వరకు కొత్త రాజధానిని ప్రకటించాలని.. దానికి mavigun అని పేరు పెట్టాలని కూడా సూచించారు. దీనికి మావి గన్ అని ఎందుకు పెట్టాలని సూచించారంటే.. జగన్ చెప్పినది వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. మచిలీపట్నంలో మొదటి రెండు అక్షరాలు.. విజయవాడలోని మొదటి రెండు అక్షరాలు.. గుంటూరులోనే మొదటి మూడు అక్షరాలు కలిపి ఈ పేరు పెట్టాలట.
సోషల్ మీడియాలో సెటైర్లు..
జగన్ ఈ మాటలు చెప్పేసరికి.. బ్రహ్మానందం కామెడీ మీమ్స్ గుర్తుకువస్తుంది. ఏంటి బాబు అన్నావ్ మరోసారి అను.. అంటూ మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. ఇక టీవీలో చూస్తున్న వారు ఏంటి మావిగన్ అంటూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ కనిపించారు. అసలు రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి మనసులో ఉన్న అభిప్రాయం ఏంటో తెలియడం లేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయి నేత చాక్లెట్ తగాదా మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి. చివరకు సొంత పార్టీ వారు కూడా ఈయనకి ఏమయింది.. అనే రీతిలో వ్యాఖ్యానిస్తున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆయన తీరుతో వైసిపి నేతలు కూడా ఇదేం పిచ్చి అనుకోకుండా ఉండలేకపోతున్నారట. రాజధానిపై ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న ఆయన తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు అన్న భావన ఉంది. మన వాడిని ఎవరు మార్చలేరులే అని చాలామంది వైసిపి నేతలు బాధపడుతున్నారట. ఒక్క మాట మాత్రం నిజం. సోషల్ మీడియాకు అవసరమైన కంటెంట్ ను ఇచ్చేశారు.
ఎప్పటికప్పుడు మాటలు మారుస్తూ..
అమరావతిని నిర్వీర్యం చేసింది జగన్మోహన్ రెడ్డి. సర్వనాశనం చేసింది కూడా ఆయనే. సొంత రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది కూడా ఆయనే. అమరావతికి చట్టబద్ధత వస్తుంటే అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి విషం చిన్నారు అంటే ఏమనాలి. అమరావతిలో అవినీతి అంటూ కొత్త విషయాలు చెప్పలేదు. పాత ఖర్చులు మాటే మళ్లీ బయటపెట్టారు. గంటల తరబడి మాట్లాడిన ఆయన తాము అధికారంలోకి వస్తే అమరావతి నే కొనసాగిస్తామన్న మాట మాత్రం చెప్పలేదు. పైగా మావిగన్ అంటూ కొత్త పదం జత చేసి.. మచిలీపట్నం నుండి విజయవాడ వరకు రాజధాని విస్తరించాలని కొత్త సూచన చేశారు. ఆయనేదో ఇప్పుడు చట్టబద్ధత అవుతుంది కాబట్టి దానికి విరుగుడుగా ఈ వ్యాఖ్యలు చేశారు. మరి అదే ఆలోచన ఉండి ఉంటే తాను అధికారంలో ఉన్నప్పుడు చేసి చూపించవచ్చు కదా. ఐదేళ్లపాటు పూర్తి చేసి ఉంటే అందరూ హర్షించేవారు కదా. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలి తప్ప. చిన్నపిల్లలు మాదిరిగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రజలను గొర్రెల్లా చూస్తున్నారు. అచ్చం వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణులు మాదిరిగా ప్రజలు కూడా ఉంటారని ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఉన్నారు. అందుకే ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
Also Read: 24 వ స్థానం నుండి 1వ స్థానానికి ఎగబాకిన పంచాయితీ రాజ్ శాఖ..పవన్ పనితీరుకు జాతీయ పురస్కారం..
పార్లమెంటు నిర్ణయానికి సవాల్..
ప్రజలకు రాజ్యాంగం పట్ల.. వ్యవస్థల పట్ల అవగాహన లేదని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. పార్లమెంటులో చేసే చట్టాలను.. అసెంబ్లీలో మార్చేయవచ్చు అనే కొత్త సలహా ఇచ్చారు. ఆయన తీరును చూసి రాజకీయ విశ్లేషకులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. పార్లమెంటు నిర్ణయాలను సవాల్ చేసి ఆయన స్థాయిని చూసి ఆశ్చర్యపోతున్న వారు ఉన్నారు. మూడు రాజధానుల ముచ్చట తీర్చుకోలేకపోయారు. మరోవైపు అమరావతిని ఆహ్వానించలేకపోయారు. కానీ మేము అధికారంలోకి వస్తే మళ్లీ చట్టం మారుస్తాం అని సెలవు ఇవ్వడం ద్వారా తన అపరిపక్వ, అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ కంటే తన భావజాలం అధికమని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.
ఎంత దాకైనా సిద్ధం..
అమరావతి రాజధాని అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తారు అనేది ఆయన మాటల ద్వారా అర్థం అవుతుంది. అమరావతి రాజధాని కి మేము సమ్మతం. ఇప్పుడున్న భూమికి మించి సహకరించాలని అప్పట్లో విపక్ష నేతగా సూచనలు చేశారు. తరువాత పాలన వికేంద్రీకరణకు మూడు రాజధానులు అన్నారు. ఇప్పుడేమో మావిగన్ అంటున్నారు. అసలు ఆయన రాజధాని విషయంలో స్టాండ్ లేకుండా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే నవ్యాంధ్రప్రదేశ్ తో ఆయన ఆటలాడుకుంటున్నారు.
