YS Jagan Mohan Reddy: జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వైఖరిని మార్చుకున్నట్టు కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని విభేదించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని ఒక బద్ధ శత్రువుగా చూడడంతో జగన్ విషయంలో బిజెపి కూడా సానుకూల వైఖరితోనే ఉండేది. ఒక ప్రాంతీయ పార్టీగా దానిని చూసుకుంటూ వచ్చింది. స్నేహితుడిగా చంద్రబాబు ఉన్నా.. ఆయన ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం కొంత సాఫ్ట్ కార్నర్ గానే ఉండేది. ఏపీ రాజకీయ పరిణామాలు దృష్ట్యా బిజెపి సైతం చూసి చూడనట్టుగా ఉంటూ వచ్చింది. అటు తన ప్రత్యర్థి భాగస్వామ్య పార్టీ అయిన బిజెపి విషయంలో సైతం జగన్మోహన్ రెడ్డి సానుకూలంగానే వెళ్లేవారు. ఇలా పరస్పరం సానుకూలత నడుమ బిజెపి, వైసిపి ఇన్నేళ్లపాటు కొనసాగుతూ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం అలా కాదు. వైసిపి విషయంలో సాఫ్ట్ కార్నర్ తో చూస్తాం అంటే బిజెపికి కుదిరే పని కాదు. బిజెపి ద్వారా కొన్ని రకాల రాజకీయ ప్రయోజనాలు పొందుతామంటే వైసీపీకి కుదరదు.
* బిజెపి మనసు మారుతోంది..
కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి విషయంలో బిజెపి అలా సానుకూలంగా ఉండేది. కానీ ఇప్పుడు టిడిపి కీలక భాగస్వామి. ఆ పార్టీ అవసరం బిజెపికి ఉంది. అందుకే టిడిపికి ఎనలేని ప్రాధాన్యమిస్తోంది బిజెపి. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూలత తగ్గించింది. దీంతో జగన్మోహన్ రెడ్డి సైతం పునరాలోచనలో పడ్డారు. బిజెపితో ఇక లాభం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల పెట్రోల్ డీజిల్ ధరలపై నిరసన తెలిపారు. తాజాగా ప్రత్యేక ఓటరు సవరణ జాబితాను కూడా వ్యతిరేకిస్తున్నారు. తద్వారా భారతీయ జనతా పార్టీకి దూరం కావాలన్న నిర్ణయానికి వచ్చారు.
* విరుద్ధ భావజాలం..
బిజెపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలది విరుద్ధ భావజాలం. నేరుగా పొత్తు పెట్టుకునే అవకాశం లేదు ఆ రెండు పార్టీలకు. అలాగని సానుకూలతను ఎల్లకాలం కొనసాగించలేవు. రాజకీయంగా అది రెండు పార్టీలకు మైనస్ కాక తప్పదు. పైగా ఏపీలో కూటమి స్ట్రాంగ్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో జాతీయస్థాయిలో మరోకూటమిగా ఉన్న కాంగ్రెస్ తో స్నేహం చేయక తప్పని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు జగన్మోహన్ రెడ్డితో టచ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమిళనాడులో విజయ్ అధికారంలోకి వచ్చారు. కలిసికట్టుగా ఉంటే ఏపీపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే జగన్ మనసు మారినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
