Jagan KTR national media agreements: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర రాజకీయ పరిస్థితులు నడుస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఒకే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ ఇద్దరు నేతలకు ఇంటి పోరు ఉంది. ఏపీలో షర్మిల.. తెలంగాణలో కవిత సొంత కుటుంబాలనే రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారు. ప్రస్తుతం కెసిఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ అన్ని తానై వ్యవహరిస్తున్నారు. అయితే తండ్రి వారసత్వానికి పోటీ పడుతున్నారు కవిత. సోదరుడు కేటీఆర్ కు సవాల్ విసురుతున్నారు. షర్మిల పరిస్థితి చెప్పనవసరం లేదు. కేవలం కుటుంబ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఆమెకు గిట్టడం లేదు. ఇటీవల మావిగన్ జోకర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతటి కామెంట్స్ చేసేందుకైనా వెనుకడుగు వేయడం లేదు. అటు తెలంగాణలో కేటీఆర్.. ఇది ఏపీలో జగన్మోహన్ రెడ్డి దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకోవడం విశేషం.
జగన్ రెండోసారి..
తెలంగాణలో( Telangana) పాదయాత్ర చేస్తానని ప్రకటించారు కేటీఆర్. అదే సమయంలో ఏపీలో 2027లో తన పాదయాత్ర ఉంటుందని జగన్మోహన్ రెడ్డికి చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగా సన్నాహాలు చేసుకుంటున్నారు. దాదాపు 5000 కిలోమీటర్లకు పైగా నడవాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి పాదయాత్ర కొత్త కాదు. 2017 లోనే ఆయన పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. అందుకే ఇప్పుడు మరోసారి పాదయాత్ర చేసి ఏపీలో అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. కానీ ఈసారి పాదయాత్ర కలిసి వస్తుందా లేదా అనే అనుమానం ఆయనలో ఉంది.
సొంత మీడియా
తాజాగా కేటీఆర్( KTR) సైతం 2027 లో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. పార్టీలో ఒక నిర్ణయం తీసుకొని షెడ్యూల్ ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. అయితే కేటీఆర్ పాదయాత్ర ప్రారంభిస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమే. ఎందుకంటే ఉభయ రాష్ట్రాల్లో యువ నేతలు ఇద్దరూ ప్రజల బాట పడతారు. పాదయాత్రలతో హోరెత్తిస్తారు. అయితే వేరువేరు తెలుగు రాష్ట్రాలు అయినా.. ఒకే మీడియా కొనసాగుతూ వస్తోంది. ఇద్దరూ ఒకేసారి పాదయాత్ర చేస్తే.. వారికి కవరేజ్ ఇవ్వడం మీడియాకు కష్టతరంగా మారుతుంది. అయితే ఇద్దరికీ సొంత మీడియా ఉంది. కానీ ఇప్పటివరకు పరస్పర లాభం చేకూర్చుకుంటూ వచ్చారు. కానీ ఈసారి అలా పరిస్థితి ఉండదు. ఒకేసారి పాదయాత్ర చేస్తే మాత్రం ఇబ్బందికరమే. అందుకే ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు నేషనల్ మీడియాతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి ఆ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
