YSRCP Kapu Politics: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన తప్పును తెలుసుకుంది. మొన్నటి ఎన్నికల్లో కాపులను వదులుకొని మూల్యం చెల్లించుకుంది. అందుకే దాని నుంచి గుణపాఠాలు నేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే కాపు ఓటు బ్యాంకు ను మళ్లీ పొందేందుకు కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ బాధ్యతను గోదావరి జిల్లాలకు చెందిన కాపు నేత తోట త్రిమూర్తులకు అప్పగించారు. ఆయన కాపు నేతలకు భారీ విందు సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తోంది. తోట త్రిమూర్తులకు అండగా అంబటి రాంబాబు, కన్నబాబు లను అందించారు జగన్. ఈ ముగ్గురు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు నేతలను సమీకరించి… వైసీపీ వైపు కాపులు టర్న్ అయ్యేలా.. కూటమిపై కాపులు తిరగబడేలా ప్లాన్ చేయనున్నారు.
* ప్రతిపక్షంలో ఉంటేనే..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాపుల కోసం జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం ఉండదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నిర్లక్ష్యం చేయక మానరు. 2014లో అధికారంలోకి వచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఆ సమయంలో కాపుల్లో వ్యతిరేకత తెచ్చేందుకు ముద్రగడ పద్మనాభం ను వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయనతో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని చేయించారు. తుని రైలు విధ్వంస ఘటనతో ఆ ఉద్యమం హింసాత్మక పరిస్థితికి దారితీసింది. కాపులు టిడిపి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచుకున్నారు. దాని ప్రభావం 2019 ఎన్నికల్లో కనిపించింది. అయితే అలా వైసీపీకి దగ్గరైన కాపులను అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు జగన్. దాని పర్యవసానాలు 2024 ఎన్నికల్లో చూసారు. కాపులు పవన్ వెంట నడిచారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి కాపులను దూరం చేయాలని చూస్తున్నారు జగన్. ఆ బాధ్యతను వైసీపీలో ఉన్న కాపు నేతలకు అప్పగించారు.
* కాపులు లేనిదే కష్టం..
కాపులు లేనిదే రాజకీయం చేయలేనని ఒక నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అందుకే అంబటి రాంబాబు తో తిట్టించి ఆయన జైలుకు వెళ్లాక కాపు టైగర్ గా చిత్రీకరించారు. కాపుల విషయంలో ఏ పరిణామం జరిగినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందిస్తున్నారు. తాజాగా సాయి కృష్ణ అనే కాపు యువకుడు పై క్రిమినల్ కేసు లు ఉంటే.. ఆయనను సాధారణంగా జైలుకు తీసుకెళ్లారు. తర్వాత ఆ యువకుడు అదృశ్యమయ్యాడు. ఇలా అదృశ్యం వెనుక కూటమి ప్రభుత్వ వైఫల్యం ఉందని.. కాపుల్లో ఒక రకమైన వ్యతిరేకత పెంచే ప్రయత్నంలో ఉన్నారు.
* తోట త్రిమూర్తులు కొత్త పాత్రలో ..
ఇప్పుడు తోట త్రిమూర్తులకు కాపుల బాధ్యత అప్పగించారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభంకు అప్పగిస్తే గతం మాదిరిగా కాపులు నమ్మే పరిస్థితిలో లేరు. అలా నమ్మి ఉంటే కచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో ముద్రగడ మాట వినేవారు కదా ప్రజలు. అయితే ఇప్పటికీ వైసీపీ పట్ల కాపుల అభిప్రాయం మారలేదు. ఇప్పుడు తోట త్రిమూర్తులు లాంటి వారికి బాధ్యతలు కట్టబెట్టినా వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
