CM Jagan – Assignment Lands : ఆ 43 వేల ఎకరాలపై వైసీపీ సర్కారు కన్ను

భూములు లేని రైతులు, పేదలకు ఈ భూములు కేటాయించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. అయితే దీనిపై వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కసరత్తు జరుగుతూ వస్తోంది. ముందుగా నెల్లూరు జిల్లాలో కార్యక్రమాన్ని పూర్తిచేసి.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్నది జగన్ ప్లాన్

Written By: Dharma, Updated On : May 7, 2023 4:17 pm
Follow us on

CM Jagan – Assignment Lands : ఏపీ ప్రజలకు శుభవార్త. దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం చూపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మంది ఎదురుచూస్తున్న 43 వేల ఎకరాల చుక్కల భూములకు సంబంధించి పరిష్కార మార్గం చూపి పట్టాలు అందించనుంది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల సీఎం జగన్ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల మధ్యే గడపాలని డిసైడయ్యారు. సంక్షేమ పథకాల బటన్ నొక్కడంతో పాటు అభివృద్ధి పనులకు సైతం శంకుస్థాపనలు చేయాలని భావిస్తున్నారు. 13 ఉమ్మడి జిల్లాల పరిధిలో కార్యక్రమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో చుక్కల భూమికి సంబంధించి పట్టాల పంపిణీ చేయనున్నారు.

జనాల మధ్య ఉంటూ..
ప్రజల మధ్య ఉండి ప్రజాభిమానాన్ని చూరగొనాలని జగన్ భావిస్తున్నారు. ఇటీవలే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించారు. తొలుత మూలపేట పోర్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు సైతం శ్రీకారం చుట్టారు. తరువాత  భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చింతపల్లి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్‌ ప్రాజెక్ట్‌ మిగులు పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను ఆవిష్కరించారు. విశాఖలో అదాని డేటా సెంటర్, వైజాగ్‌ ఐటీ టెక్‌ పార్క్‌ నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు. అటు తరువాత నెల్లూరు టూర్ కు సిద్ధపడుతున్నారు.

12న సీఎం టూర్..
నెల్లూరు జిల్లా కావలిలో ఈ నెల 12న సీఎం జగన్ పర్యటన సాగనుంది. అయితే చుక్కల భూముల పట్టాల పంపిణీకిగాను కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 1924 -1946 మధ్య కాలంలో లోనో రెవిన్యూ వాళ్ల ఒక సర్వే చేశారట. ఆసర్వే జరుపుతున్నపుడు కొన్ని చోట్ల భూముల యజమాని అందుబాటులో లేడని యజమాని కాలమ్ నింపకుండా చుక్కలు పెట్టారు. ఇలాంటి చుక్కలు పెట్టిన భూములే చుక్కల భూములు.  రెవిన్యూ వాళ్ల వాడుకలో ఇవి ’డాటెడ్ ల్యాండ్స్’. భూములు లేని రైతులు, పేదలకు ఈ భూములు కేటాయించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. అయితే దీనిపై వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కసరత్తు జరుగుతూ వస్తోంది. ముందుగా నెల్లూరు జిల్లాలో కార్యక్రమాన్ని పూర్తిచేసి.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్నది జగన్ ప్లాన్

ముందే జీవో..
ఇంతకు ముందే చుక్కల భూముల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీచేసింది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం పరిధిలో సుమారు 6,000 ఎకరాల వరకు చుక్కల భూములను గుర్తించింది. అందుకే ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం డిసైడయ్యింది. ప్రభుత్వ  తాజా నిర్ణయంతో 50 వేల మందికి కష్టాలు తీరనున్నాయి. 43 వేల ఎకరాలు పూర్తిస్థాయిలో యజమానులకు భూబదలాయింపు జరగనుంది. ఎన్నికల ముంగిట కార్యక్రమం ద్వారా భారీగా రాజకీయ లబ్ధికి వైసీపీ ప్లాన్ చేసింది. ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరీ.