Kodali Nani: ఏపీలో అత్యంత హాట్ నియోజకవర్గాలు గుడివాడ, గన్నవరం. కృష్ణాజిల్లాలోని ఈ రెండు నియోజకవర్గాలు ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలిచేవి. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉండే కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు. ముఖ్యంగా రాజకీయ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబుపై విరుచుకుపడేవారు. ఆయన కుమారుడు లోకేష్ పై సైతం వ్యక్తిగత కామెంట్లు చేసేవారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఈ ఇద్దరు నేతలు ఒక వెలుగు వెలిగారు. ఇందులో కొడాలి నాని మంత్రిగా కూడా వ్యవహరించారు. అటు వంశీ మోహన్ ఎమ్మెల్యే గా ఉండేవారు. మొన్నటి ఎన్నికల్లో ఆ ఇద్దరూ ఓడిపోయారు. ముందుగా అనారోగ్యానికి గురయ్యారు. ఇంకొకరు జైలుకు వెళ్లి అనారోగ్యం పాలయ్యారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరూ నియోజకవర్గాలకు దూరంగా ఉన్నారు. దీంతో వైసిపి కార్యకలాపాలు నిలిచిపోయాయి. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడినట్లు తెలుస్తోంది.
* రేపల్లె ఫార్ములా..
మొన్ననే రేపల్లెలో మోపిదేవి శ్రీనివాసరావు అనే కాంగ్రెస్ నాయకుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు మొన్నటి ఎన్నికల్లో నోటా తో సమానంగా ఓట్లు వచ్చాయి. అయినా సరే అవసరం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మోపిదేవి శ్రీనివాసరావును పిలిచి పార్టీ కండువా కప్పారు. స్థానిక వైసీపీ ఇన్చార్జ్ మోహన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని.. ఆయన గెలుపు బాధ్యతలు తీసుకుంటే.. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు గుడివాడ తో పాటు గన్నవరంలో అదే ఫార్ములా తో అడుగులు వేస్తున్నారట జగన్. అందుకే ఆ ఇద్దరు నేతలను పిలిచి చర్చించారట. వారి అభిప్రాయాన్ని సేకరించారట.
* కొత్త నేతలు రెడీ
గుడివాడలో ఇవే తనకు చివరి ఎన్నికలు అని కొడాలి నాని మొన్న ప్రకటించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. గత రెండు సంవత్సరాలుగా గుడివాడలో పార్టీ యాక్టివిటీస్ తగ్గాయి. అదే సమయంలో టిడిపి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దూసుకుపోతున్నారు. గన్నవరం లో కూడా అదే పరిస్థితి. అక్కడి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగారు. అందుకే ఆ రెండు నియోజకవర్గాల్లో టిడిపి పట్టు బిగించడంతో జగన్మోహన్ రెడ్డి పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. గుడివాడలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓ ఎన్నారై జగన్మోహన్ రెడ్డికి టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు గన్నవరం నియోజకవర్గానికి చెందిన మహిళ నేత సుంకర పద్మశ్రీ సైతం వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఆమె కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలిగా ఉన్నారు. పిసిసి అధ్యక్ష పదవి ఆశించారు. షర్మిల రూపంలో ఆమెకు ఛాన్స్ మిస్సయింది. అందుకే ఆమె వైసీపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అందుకే ఇద్దరు నేతలను పిలిచి పార్టీలోకి కొత్తవారు వస్తున్నారని.. ఉంటే మీరు రంగంలో ఉండండి.. లేకుంటే వారికి ఛాన్స్ ఇస్తానంటూ జగన్మోహన్ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్లు సమాచారం.