Dharmana Brothers: వైయస్ జగన్మోహన్ రెడ్డి తో తాడోపేడో తేల్చుకునేందుకు ధర్మాన సోదరులు సిద్ధమయ్యారన్న ప్రచారం శ్రీకాకుళం పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. దానికి ప్రధాన కారణం దువ్వాడ శ్రీనివాస్. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాస్ పై కొద్ది నెలల కిందట సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. ఆయన వ్యక్తిగత కుటుంబ వ్యవహార శైలితో పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి సస్పెన్షన్ వేటు వేశారు. అయితే దీని వెనుక ధర్మాన సోదరుల హస్తం ఉందని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తూ వచ్చారు. ధర్మాన సోదరులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కూడా చాలా సందర్భాల్లో. అయితే దువ్వాడ శ్రీనివాస్ పై కేవలం సస్పెన్షన్ వేటు కాదని.. పూర్తిగా పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని ధర్మాన సోదరులు పట్టుబడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. దానికి కారణం లేకపోలేదు. లేనిపోని వివాదాలతో పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు అనేది ధర్మాన సోదరుల అభిప్రాయం.
* ఎంతగానో ప్రోత్సాహం..
కేవలం దువ్వాడ శ్రీనివాస్ లో ఉన్న దూకుడు తనం చూసి జగన్మోహన్ రెడ్డి ఎంతగానో ప్రోత్సహించారు. కింజరాపు ఫ్యామిలీని నియంత్రించేందుకు వీలుగా దువ్వాడ శ్రీనివాస్ కు ప్రోత్సాహం అందించారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన సరే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఒకానొక దశలో మంత్రి పదవి ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే 2024లో పార్టీ మొత్తం ఓడిపోయింది. అప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాస్ పై నమ్మకం పెట్టుకుని మరీ జగన్ మోహన్ రెడ్డి చాన్స్ ఇచ్చారు. కానీ జగన్ అవకాశాలు ఇవ్వడం తప్పించి దువ్వాడ శ్రీనివాస్ నెగ్గుకు రాలేకపోతున్నారు అనేది హై కమాండ్ కు నివేదికలు అందాయి. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా ప్రభంజనం వీచినా.. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి దువ్వాడ శ్రీనివాస్ నెగ్గుకు రాకపోవడం వెనుక ఆయన వ్యక్తిగత వ్యవహార శైలి ఉందన్నది ఒక నివేదిక.
* వైసీపీలోకి వస్తానన్న నమ్మకం..
తన కుటుంబ వ్యవహారాలను వీధిన పడేశారు. తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టారు. లేనిపోని వివాదాల్లో చిక్కుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. అయితే ఆ పరిణామాలు జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆయనపై చర్యలు తీసుకోలేదు. కొద్ది నెలల తర్వాత ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. కానీ ధర్మాన సోదరులు పనిగట్టుకుని తనపై సస్పెన్షన్ వేటు వేయించారు అని ఆరోపిస్తూ వచ్చారు దువ్వాడ శ్రీనివాస్. ఇప్పుడు కూడా ఆయన తాను తిరిగి వైసిపిలోకి వస్తానని.. ధర్మాన సోదరుల పని పడతానని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటువంటి నేతను శాశ్వతంగా బహిష్కరించాల్సింది పోయి ఎంటర్టైన్ చేస్తున్నారు అంటూ ధర్మాన సోదరులు ఆగ్రహంతో ఉన్నారు. తక్షణం దువ్వాడ శ్రీనివాస్ పై శాశ్వత బహిష్కరణ చేయకపోతే తాము శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం చేయమని భీష్మించుకుని కూర్చున్నారట. అందుకే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ యూటర్న్ తీసుకున్నారు. కింజరాపు ఫ్యామిలీని మళ్లీ టార్గెట్ చేసుకోవడం మొదలుపెట్టారు. మరి జగన్ ధర్మాన సోదరుల ఒత్తిడికి తలొగ్గుతారా? లేదా? అన్నది చూడాలి.
