Homeఆంధ్రప్రదేశ్‌Jada Sravan Kumar: జడ శ్రావణ్ తో జాగ్రత్త పడుతున్న జగన్!

Jada Sravan Kumar: జడ శ్రావణ్ తో జాగ్రత్త పడుతున్న జగన్!

Jada Sravan Kumar: ఏపీ రాజకీయాల్లో కుల ప్రభావం అధికంగా ఉంటుంది. కులాల వారీగా ఓట్లు చీలిపోతాయి కూడా. అలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం అండ ఉంటుంది. మరోవైపు దళిత క్రైస్తవ ఓటర్లు కూడా అటువైపే మొగ్గు చూపుతారు. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. కానీ దళిత క్రైస్తవులు మాత్రం ఆ పార్టీని ఆదరించారు. అయితే ఆ ఓటు బ్యాంకు పై తాజాగా గురి పెట్టారు జడ శ్రవణ్ కుమార్. గోదావరి జిల్లాలో దళిత క్రైస్తవ సభ పెట్టి.. మీరంతా జడ శ్రావణ్ తాలూకా అని చెప్పే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ మాదిరిగా ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అవుతానని కూడా తేల్చి చెప్పారు. పనిలో పనిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై కూడా సున్నిత విమర్శలు చేశారు. దీంతో ఆ పార్టీలో అంతర్మధనం ప్రారంభం అయ్యింది.

* కూటమి ప్రభుత్వం పై వికటించిన ప్రయోగం..
కూటమి ప్రభుత్వంపై బురదజల్లేందుకు జడ శ్రావణ్ కుమార్ సేవలను వాడుకోవాలని చూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. సాక్షి మీడియాలో ఆయన ప్రెస్మీట్లకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతూ వస్తోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తో పాటు ప్రభుత్వాన్ని ఇరుక్కున పెట్టేలా జడ శ్రావణ్ కుమార్ వ్యాఖ్యలు నడిచేవి. ఒక్క మాటలో చెప్పాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ శ్రావణ్ కుమార్ ను ఒక అస్త్రంగా మార్చుకోవాలని చూసింది. కానీ ఇప్పుడు అదే జడ శ్రవణ్ నేరుగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత కీలకమైన దళిత క్రైస్తవ ఓటు బ్యాంకుకే ఎసరు పెట్టేలా ఉన్నారు. ఏలూరులో దళిత క్రైస్తవ సమర శంఖారావం బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఇది కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సభ. కానీ వైసీపీని ఉలిక్కిపడేలా చేసేసారు శ్రావణ్ కుమార్.

* టార్గెట్ రఘురామ..
ఆకివీడు ఘటన నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు క్రైస్తవ మతాన్ని కించపరిచారని ప్రధాన అజెండాతో ఈ సభ నడిచింది. రఘురామకృష్ణం రాజును తీవ్రస్థాయిలో టార్గెట్ చేసిన జడ శ్రావణ్ కుమార్ ఈ సభ ద్వారా దళిత క్రైస్తవులను ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. తనను తాను అభినవ అంబేద్కర్ గా చూపించే ప్రయత్నం చేశారు. కేవలం వేదికలపై ఉపన్యాసాలకే పరిమితం కాకుండా.. ఇకపై రాష్ట్రంలోని దళిత క్రైస్తవులంతా పాము జడ శ్రావణ్ తాలూకా అని గర్వంగా చెప్పుకోవాలి అంటూ ఇచ్చిన పిలుపు వైసిపిలో సంచలనంగా మారుతుంది. ఆ పార్టీ నేతలు ఇప్పుడు శ్రావణ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ ఓటు బ్యాంకు పైనే గురి పెడతారా అని ప్రశ్నిస్తున్నారు. తాము మీడియా మైలేజ్ ఇస్తూ.. పరోక్షంగా పాలు పోసి పెంచిన జడ శ్రావణ్.. ఇప్పుడు సొంత సామాజిక వర్గాలను చీల్చే ప్రయత్నం చేస్తుండడం పై వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

* వైసిపి ప్రోత్సాహం..
జడ శ్రావణ్ కుమార్ నేరుగా ఈసారి తాను ఉప ముఖ్యమంత్రిని అవుతానని చెబుతున్నారు. అయితే అది ఎలా సాధ్యమో తెలియడం లేదు. కానీ అనవసరంగా జడ శ్రవణ్ కుమార్ ను హైలెట్ చేశామని వైసిపి నేతలు బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ అంశంతో కూటమికి ప్రయోజనం చేకూర్చేలా ఉంది పరిస్థితి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకులో చీలిక వస్తే ఆ పార్టీకి దారుణ పరాజయం తప్పదు.. జడ శ్రావణ్ నిజంగా దళిత క్రైస్తవ ఓట్లను టార్గెట్ చేసుకుంటే ప్రతి నియోజకవర్గంలో వేలాది ఓట్లకు గండి పడవచ్చు వైసీపీకి. కూటమిని దెబ్బతీయడానికి వాడిన అస్త్రం ఇప్పుడు రివర్స్ తిరిగి జగన్ సొంత సామ్రాజ్యాన్ని దెబ్బతీసేలా ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version