Andhra Jyothi: 15 కోట్ల భూమి 50 లక్షలకేనా? ఆ పత్రికకు భూమి వెనుక నిజనిజాలేంటి?

Andhra Jyothi విశాఖలో ఆంధ్రజ్యోతి యాజమాన్యం 15 కోట్ల రూపాయల భూమిని కేవలం 50 లక్షల రూపాయలకే సొంతం చేసుకుంది. ఆంధ్రజ్యోతి ప్రెస్ కు 1986లో అప్పటి టిడిపి ప్రభుత్వం విశాఖ శివారు పరదేశిపాలెం లో 1.50 ఎకరాల భూమిని కేటాయించింది.

Written By: Dharma, Updated On : February 14, 2024 11:42 am
Follow us on

Andhra Jyothi: చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేవి చెడ్డ పనులు. నిత్యం అవినీతిపై సమరం చేస్తున్నామని.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నామని ఎల్లో మీడియా చెబుతోంది. తమకు తాము సత్యహరిశ్చంద్రులమని తమ రాతలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడంలో ఈ సెక్షన్ ఆఫ్ మీడియా ఆరితేరిపోయింది. అయితే చంద్రబాబు ప్రయోజనాల కోసం ఎంత దాకైనా తెగించేందుకు ఈ మీడియాధిపతులు సిద్ధంగా ఉంటారు. అయితే దీని వెనుక అభిమానం, ప్రేమ కాదు. చంద్రబాబు అధికారంలో ఉండాలి. తాము సైతం కొన్ని రాళ్లు వెనకేసుకోవాలి అన్నదే వీరి ముఖ్య ఉద్దేశ్యం.ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ టిడిపి ప్రభుత్వాల హయాంలో భారీ ప్యాకేజీ కొట్టేయడంతో పాటు ప్రభుత్వ భూములు సైతం కారు చౌకగా కొట్టేశారు.

విశాఖలో ఆంధ్రజ్యోతి యాజమాన్యం 15 కోట్ల రూపాయల భూమిని కేవలం 50 లక్షల రూపాయలకే సొంతం చేసుకుంది. ఆంధ్రజ్యోతి ప్రెస్ కు 1986లో అప్పటి టిడిపి ప్రభుత్వం విశాఖ శివారు పరదేశిపాలెం లో 1.50 ఎకరాల భూమిని కేటాయించింది. పదివేల రూపాయలు చెల్లించి కారు చౌకగా ఆ భూమిని కొట్టేసింది. అయితే అక్కడకు కొద్ది రోజులకే జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అందులోని ఎకరా భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మిగిలిన 50 సెంట్లు భూమి ఆంధ్రజ్యోతి సమస్త ఆధీనంలోనే ఉంది. జాతీయ రహదారి విస్తరణ కోసం తీసుకున్న భూమికి ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు. ఆంధ్రజ్యోతి వద్ద ఉన్న 50 సెంట్లు భూమికి గాను ప్రభుత్వం ఇటువంటి రుసుం వసూలు చేయలేదు.అయితే 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వానికి ఆంధ్రజ్యోతి మరోసారి దరఖాస్తు చేసుకుంది. అప్పట్లో జాతీయ రహదారి విస్తరణలో కోల్పోయిన భూమికి బదులు.. ప్రత్యామ్నాయంగా కొంత భూమిని కేటాయించాలని.. గతంలో మాదిరిగా పదివేల రూపాయలకే కావాలని కోరింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం అదే ప్రాంతంలో ఎకరా 50 సెంట్లు భూమిని గుర్తించాలని అధికారులను ఆదేశించింది. దీంతో అప్పటి కలెక్టర్ యువరాజు ఈ ప్రాంతంలో ఎక్కడ భూమి రూ.7.26 కోట్లుగా ఉందని నిర్ధారిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపారు.

చంద్రబాబు ప్రభుత్వం పై ఒత్తిడి పెంచడంతో.. 2017లో పరదేశి పాలెం లో ఉన్న ఎకరా 50 సెంట్లు భూమిని ఆంధ్రజ్యోతి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత 50 సెంట్లు భూమిని పదివేల రూపాయలు ఇచ్చేందుకు, కొత్తగా కేటాయించిన ఎకరా 50 సెంట్లు భూమిని మాత్రం 50 లక్షలు చెల్లించాలని ఆంధ్రజ్యోతికి అప్పటి టిడిపి ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం పరదేశి పాలెం లో ఎకరా భూమి 10 కోట్ల రూపాయలకు పైగా పలుకుతోంది. ఈ లెక్కన 15 కోట్ల రూపాయల విలువైన భూమిని ఆంధ్రజ్యోతి యాజమాన్యం 50 లక్షల రూపాయలకే సొంతం చేసుకుంది. నిత్యం వేదాలు వల్లించే రాధాకృష్ణ.. ఇలా అడ్డగోలుగా ప్రభుత్వ భూమిని సొంతం చేసుకోవడం విమర్శలకు కారణమవుతోంది. చెప్పేవన్నీ నీతులే.. చేసేవన్నీ ఇలాంటి పనులంటూ వైసిపి సోషల్ మీడియా రాధాకృష్ణ పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతోంది.