AP Politics : అందరూ ఒకటేనా.. అన్ని పార్టీల మెడకు లైంగిక వేధింపుల కేసులు

ఏపీలో రాజకీయ పార్టీలు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.అన్ని పార్టీల్లో లైంగిక వేధింపులు వెలుగులోకి వస్తున్నాయి. అన్ని పార్టీల నేతలు చిక్కుకుంటున్నారు. పార్టీలకు తలవంపులు తెస్తున్నారు.

Written By: Dharma, Updated On : September 17, 2024 1:25 pm

AP Politics, johnny master

Follow us on

AP Politics : మహిళలపై ఇటీవల వేధింపులు ఎక్కువయ్యాయి. పనిచేసే చోట మహిళలకు రక్షణ కరువవుతోందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ప్రతి రంగంలో కూడాఈ వేధింపులు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే తాజాగా ఏపీ రాజకీయాల్లో మహిళలపై వేధింపులు వెలుగు చూస్తుండడం సంచలనం రేపుతోంది. అయితే ఇది అన్ని పార్టీల్లో వెలుగు చూస్తుండడం విశేషం. గత వైసిపి ప్రభుత్వ హయాంలో ముంబై నటి కాదంబరి జెత్వానిని వైసీపీ పెద్దలు వేధించారని ఆరోపణలు బయటకు వచ్చాయి. అప్పట్లో ఓ పారిశ్రామికవేత్త కుటుంబం పై కేసు నుంచి తప్పించేందుకు.. ఏపీలో అక్రమ కేసులు పెట్టారని బయటపడింది. దీంట్లో వైసిపి పెద్దల ప్రమేయం ఉందని కూడా తేలింది. దీంతో వైసిపినేతతో పాటు పోలీసు ఉన్నతాధికారులపై సైతం కేసులు నమోదయ్యాయి. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. త్వరలో వైసిపి పెద్దపై కూడా చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. దీనిపై టిడిపి, జనసేన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇదే సర్కులేట్ అయ్యింది.

* సొంత పార్టీ మహిళా నేతపై
అయితే ఈ ఘటన ఇలా ఉంటే.. ఓ మహిళను లైంగికంగా వేధించారని టిడిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై బాంబు పేలింది. స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకురాలు బాధితురాలుగా మారారు. ఏకంగా సీక్రెట్ కెమెరాలతో లైంగిక దాడిని చిత్రీకరించి హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇది సంచలన అంశంగా మారిపోయింది.టిడిపి హై కమాండ్ స్పందించి కోనేటి ఆదిమూలంపై చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

* జనసేనలో జానీ మాస్టర్ పై
ఆ రెండు పార్టీలకు ఈ అంశం చికాకు పెట్టగా.. ఇప్పుడు ఆ వంతు జనసేనకు వచ్చింది. ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది.ఓ జూనియర్ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి చేశారన్నది ఆయనపై వచ్చిన ఫిర్యాదు. సినిమా షూటింగుల నిమిత్తం అవుట్ డోర్లకు వెళ్ళినప్పుడు తనపై లైంగిక దాడి చేశారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఇంటికి వచ్చి లైంగిక దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో జనసేన హై కమాండ్ స్పందించింది. జానీ మాస్టర్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది సస్పెన్షన్ వేటే.

* వైసీపీలో ఎమ్మెల్సీ అనంతబాబు
అంతకుముందు వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు అసభ్య వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఓ మహిళతో వీడియో కాల్ లో మాట్లాడుతూ ప్రైవేట్ పార్టును చూపించారు అనంతబాబు. దీనిపై పెద్ద దుమారమే నడిచింది. దీనినే సోషల్ మీడియాలో హైలెట్ చేసింది టిడిపి, జనసేన. అయితే ఇప్పుడు కొత్తగా టిడిపి నుంచి ఎమ్మెల్యే ఆదిమూలం, జనసేన నుంచి జానీ మాస్టర్ అదే తరహా వేధింపుల కేసులో చిక్కారు. దీంతో వైసీపీకి అవి ప్రచారాస్త్రంగా మారాయి. అయితే ఈ విషయంలో టిడిపి, జనసేన ముందుగానే దిద్దుబాటు చర్యలకు దిగాయి. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశాయి. కానీ వైసీపీ మాత్రం అటువంటి చర్యలకు దిగలేదు.ఇటువంటి ఘటనలను వైసీపీ సమర్ధించినట్లు అయింది.