LV Subramanyam: తిరుమల తిరుపతి దేవస్థానంలో( Tirumala Tirupati Devasthanam) కొలువు, పదవిని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఆ అదృష్టం కొందరికే దక్కుతుంది. అటువంటి చాన్స్ దక్కించుకున్నారు పూర్వపు ఈవో, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం. ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. అయితే తాజాగా లడ్డూ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్వి సుబ్రహ్మణ్యం స్పందించారు. దీనిని మహాపచారంగా పేర్కొన్నారు. ఇది మానవాళికే శాపం అని చెప్పుకొచ్చారు.. ఇందులో అనవసర వాదనలు, విమర్శలు మాని.. తప్పు చేసిన వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు అప్పటి చైర్మన్ తో పాటు ఈవో కూడా బాధ్యులేనని తేల్చి చెప్పారు. హిందువులంతా ఏకతాటి పైకి వచ్చి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కూడా పిలుపునిచ్చారు. చుక్క నెయ్యి లేకుండా రూ. 250 కోట్ల బిల్లు ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. తప్పు చేసినవారే మళ్లీ వాదనలు చేస్తున్నారని.. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు అని ఎల్వి సుబ్రహ్మణ్యం తేల్చి చెప్పడం విశేషం. ఎల్వి సుబ్రహ్మణ్యం కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* ప్రాయశ్చిత్తం ఏది?
సాధారణంగా చిన్న తప్పిదానికి పాల్పడితేనే దేవుడు ముందు ఒప్పుకొని లేంపలేసుకుంటాం.. మరోసారి ఈ తప్పిదం జరగకుండా చూసుకుంటాం అని దేవుడు ఎదుట ఒప్పుకుంటాం. ఒక్కోసారి లెంపలు వేసుకుంటాం కూడా. పొర్లు దండాలు పెడతాం కూడా. అవసరం అనుకుంటే ఉపవాస దీక్షలు కూడా చేస్తాం. కానీ సాక్షాత్ దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేయడం అనేది చిన్న నేరం కాదు. జంతు కొవ్వు కలపలేదు కానీ.. రసాయనాల మిశ్రమాన్ని కలిపారని తేలింది కదా. కానీ అది అపచారం కాదంటున్నారు. దానిని తప్పు పట్టారు ఎల్వి సుబ్రహ్మణ్యం. రసాయనాలతో తయారు చేసే నెయ్యిని వెంకటేశ్వర స్వామి ముందు దీపారాధనకు వినియోగించారు. ఇది మహా అపచారం కూడా. దానిని గుర్తించి పాపహరణం చేసుకోవాలి. అంతే తప్ప ఈ వాదనలు ఎందుకు అంటూ నిలదీసినంత పని చేశారు ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు. అప్పటికి ఈవోతో పాటు చైర్మన్ బాధ్యత వహించాల్సిందని డిమాండ్ చేశారు.
* పక్కా ప్రణాళికతో..
అంతా పక్కా ప్రణాళికతోనే ఈ రసాయనం కలిపినట్లు ఎల్వి సుబ్రహ్మణ్యం( LV Subramanyam ) అభిప్రాయపడ్డారు. ఏ రసాయనం కలిపితే నెయ్యిలా రంగుగా మారుతుంది. నెయ్యి వాసన ఎలా వస్తుంది? అని వెతికి దానికోసం ఎక్కడెక్కడికో ఎవరెవరు నువ్వు తీసుకువచ్చి భాగస్వాములు చేశారు. 2022లో నమూనాలు పరీక్షిస్తే నెయ్యి కల్తీ జరిగిందని నివేదికలు వచ్చాయి. అప్పుడు చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. టీటీడీలో ఈవోది చాలా కీలక బాధ్యత. ఎప్పటికప్పుడు టీటీడీ లో వెలుగు చూసే లోపాలను చైర్మన్ కు నివేదించాలి. ఆయన పట్టించుకోకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. అయితే ఇందులో ఫెయిల్ అయినందుకే అప్పటి ఈవో సింఘాల్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ అధ్యక్షులుగా ఉన్న వై వి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి దీనికి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ఎల్వి సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.
* అడ్డగోలు వాదనలు వద్దు..
జంతు కొవ్వు కలవలేదు నిజమే.. కానీ రసాయనాల మిశ్రమం కలిసిందని లాబ్ నివేదిక చెప్పింది కదా? మరి అది నేరం కాదా అని ప్రశ్నించారు ఎల్వి సుబ్రహ్మణ్యం. సాధారణంగా మన పిల్లలకు ఏదైనా పాల డిపో నుంచి పాలు తెచ్చి పట్టిస్తాం. అవి కల్తీ అని తేలితే కచ్చితంగా మనం నిలదీస్తాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందని తెలిస్తే ఈ అడ్డగోలు వాదనలు ఎందుకు. ఏ సిబిఐ జంతు కొవ్వు కలవలేదని చెప్పిందో.. అదే సిబిఐ రసాయనాల మిశ్రమంతో కల్తీ జరిగిందని చెప్పిన విషయాన్ని ఎందుకు వైసిపి పరిగణలోకి తీసుకోవడం లేదు. దానిని తప్పుపడుతున్నారు ఎల్వి సుబ్రహ్మణ్యం. చుక్క నెయ్యి లేకుండా 250 కోట్ల రూపాయల బిల్లు ఎలా తీసుకున్నారు అంటూ ప్రశ్నించారు. అర్థంపర్థం లేని లాజిక్కులు తీసి తప్పు చేయలేదని అనుకోవద్దని.. తప్పు స్పష్టంగా కనిపిస్తున్నందున తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తానికైతే సీనియర్ ఐఏఎస్ అధికారి మీడియా ముందుకు వచ్చి ఈ తరహా డిమాండ్లు చేయడం మాత్రం నిజంగా శుభ పరిణామం. మరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు స్పందిస్తుందో చూడాలి.
