Tadepalligudem : భార్యను ఇలా కూడా చంపవచ్చా.. భర్త కిరాతకం

గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత దావీదు పదునైన కత్తితో నిర్మలపై దాడిచేశాడు. తలను రెండు భాగాలుగా చీల్చాడు. చేతులను నరికేశాడు. ఒక చేతిని నరికి మరో చేతిలో పెట్టి పైశాచికత్వం ప్రదర్శించాడు.

Written By: Dharma, Updated On : April 28, 2023 3:16 pm
Follow us on

Tadepalligudem : పిల్లలను దారుణంగా హింసించాడు. ఆ దృశ్యాలను విదేశాల్లో ఉన్న భార్యకు పంపించాడు. బెదిరించి దేశానికి రప్పించాడు. మారిపోయానని నమ్మించాడు. అందరం కలిసి ఉందామని మభ్యపెట్టాడు. తీరా ఇంటికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి తాడేపల్లి గూడెం డీఎస్పీ బండారు శ్రీనాథ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గంజి దావీదుకు నిర్మల (34) అనే మహిళతో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరి పదేళ్లలోపు వయసున్న ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న దావీదు భార్య నిర్మలను తరచూ వేధించేవాడు. ఆయన వేధింపులు తాళలేక నిర్మల ముగ్గురు పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలను కన్నవారి వద్ద విడిచిపెట్టి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిపోయింది.

మద్యానికి బానిసై…
అయితే మద్యానికి బానిసైన దావీదు దుశ్చర్యలు పెరిగిపోయాయి. అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న ఇద్దరు కుమార్తెలను దారుణంగా హింసించాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి దుబాయ్ లోని భార్యకు పంపించేవాడు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వెలుగులోకి రావడంతో పోలీసులు స్పందించారు. దావీదుపై కేసు నమోదుచేశారు, అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అదే సమయంలో నిర్మల కూడా దుబాయ్ నుంచి ఊరికి చేరుకుంది. పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో బెయిల్ పై విడుదలైన దావీదు గురువారం రాత్రి భార్యను కలిసి క్షమించమని కోరాడు. అంతా కలిసే ఉందామని చెప్పి భార్య, ముగ్గురు పిల్లలను తన వెంట తీసుకెళ్లాడు.

ఆనందం అంతలోనే ఆవిరి..
భర్త మారిపోయాడని.. తనను, పిల్లలను బాగా చూసుకుంటాడని నిర్మల ఎంతగానో ఆనందించింది. కానీ ఆమె ఆనందం గంటల వ్యవధిలోనే ఆవిరైంది. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత దావీదు పదునైన కత్తితో నిర్మలపై దాడిచేశాడు. తలను రెండు భాగాలుగా చీల్చాడు. చేతులను నరికేశాడు. ఒక చేతిని నరికి మరో చేతిలో పెట్టి పైశాచికత్వం ప్రదర్శించాడు. కళ్లెదుటే తండ్రి ఈ దుశ్చర్యకు దిగడంతో ముగ్గురు పిల్లలు షాక్ కు గురయ్యారు. సమాచారమందుకు డీఎస్పీ శ్రీనాథ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. దావీదును అదుపులోకి తీసుకున్నారు. అటు తల్లి మరణం.. ఇటు తండ్రి జైలుపాలు కావడంతో చిన్నారులు బేలచూపులు చూస్తూకనిపించారు.