Heritage Foods: టిటిడి ( Tirumala Tirupati Devasthanam) నెయ్యి కల్తీ వ్యవహారంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఆ పార్టీకి భారీగా డామేజ్ జరిగింది. ఈ తరుణంలో హెరిటేజ్ డైరీ ని తెరపైకి తెచ్చి ఆ తప్పును సీఎం చంద్రబాబు కుటుంబ కంపెనీ పై వేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. సాక్షి మీడియాలో అడ్డగోలుగా కథనాలు ప్రచురించింది. హెరిటేజ్ సంస్థ స్పష్టమైన ప్రకటనలు చేసింది. అయినా సరే అదే పనిగా సాక్షి మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హెరిటేజ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై న్యాయస్థానం సీరియస్గా స్పందించింది. హెరిటేజ్ పై వివాదాస్పద కథ కథనాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ఆ కంటెంట్ను 24 గంటల్లో తొలగించాలని కూడా సూచించింది. నివేదికలు, ఇంటర్వ్యూలు, చర్చలతో పాటు అన్ని లింకుల యాక్సిస్ ను నిలిపివేయాలని ఆదేశించింది.. నాలుగు వారాల్లో ఈ అభియోగాలపై జవాబు ఇవ్వాలని కూడా ఆదేశించింది. దీంతో సాక్షి మీడియాతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలినట్లు అయింది.
* కోర్టును ఆశ్రయించిన హెరిటేజ్..
గత కొద్దిరోజులుగా హెరిటేజ్ పై( heritage) దుష్ప్రచారానికి దిగింది సాక్షి మీడియా. అసత్య కథనాలను ప్రచురించింది. ప్రసారం చేసింది. సాక్షి మీడియా తమపై అసత్య ప్రచారం చేస్తోందని.. అభ్యంతరకర కథనాలు, అసత్య వార్తలతో తమ పరువుకు భంగం కలిగించింది అంటూ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇటీవల హర్యానాలో నమోదైన జరిమానా అంశాన్ని, ఇండాపూర్ డైరీ వ్యవహారాన్ని హెరిటేజ్ ఫుడ్స్ కు ముడి పెడుతూ సాక్షి మీడియా అసత్య కథనాలను ప్రచురిస్తుందంటూ ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. ఈ కథనాలు తమ సంస్థ 33 ఏళ్ల ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని.. పూర్తిగా వాస్తవ విరుద్ధమని తెలిపింది. ఇటువంటి కథనాలను ప్రచురించిన, ప్రసారం చేసిన సాక్షి మీడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం విధించాలని విజ్ఞప్తి చేసింది.
* న్యాయమూర్తి ఆదేశాలు..
హెరిటేజ్ ఫుడ్స్( Heritage foods ) దాఖలు చేసిన ఈ పిటిషన్ పై నిన్ననే విచారణ జరిపింది ఢిల్లీ హైకోర్టు. దీనిపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. హెరిటేజ్ కు వ్యతిరేకంగా ప్రచురించిన, ప్రసారం చేసిన అసత్య, తప్పు దోవ పట్టించే, పరువు నష్టం కలిగించే కంటెంట్ను న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. హెరిటేజ్ కు వ్యతిరేకంగా ప్రచురించడం, పోస్ట్ చేయడం, అప్లోడ్ చేయడం, ప్రచారం చేయడం కొనసాగించకుండా సాక్షి వార్తాపత్రిక, సాక్షి టీవీ, వాటి అనుబంధ సంస్థలు, ఇతర సోషల్ మీడియా వినియోగదారులను నియంత్రిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
* కంటెంట్ ను తొలగించాల్సిందే..
24 గంటల్లో హెరిటేజ్ కు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ ను తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. భవిష్యత్తులో కూడా ఈ అభ్యంతరకర కంటెంట్ ప్రసారం కాకుండా చూడాలని ధర్మాసనం ఆదేశించింది. సోషల్ మీడియాలోని మెటా, ఎక్స్ వంటి డిజిటల్ ప్లాట్ ఫామ్ లు ఈ వివాదాస్పద కంటెంట్ ను గుర్తించి 55 ఫేస్బుక్ లింకులు, 52 ఇన్స్టాగ్రామ్ లింకులు, 70 యూట్యూబ్ లింకులు, 85 ఎక్స్ లింకులను తొలగించాలని తెలిపింది. సాక్షి మీడియాకు గట్టి హెచ్చరికలు పంపింది. మొత్తానికైతే హెరిటేజ్ విషయంలో సాక్షి మీడియాకు గట్టి దెబ్బ తగిలింది.