Homeఆంధ్రప్రదేశ్‌Raghu Ramakrishna Raju: జగన్ కు బిగుస్తున్న ఉచ్చు.. ఈ కేసుతో మొదలుపెట్టిన చంద్రబాబు...

Raghu Ramakrishna Raju: జగన్ కు బిగుస్తున్న ఉచ్చు.. ఈ కేసుతో మొదలుపెట్టిన చంద్రబాబు సర్కార్

Raghu Ramakrishna Raju: కుడి ఎడమైతే ఎలా ఉంటుందో ఇప్పుడు జగన్ కు తెలుస్తోంది. అధికారం కోల్పోయేసరికి ఇప్పుడు అన్ని వైపుల నుంచి ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు కాపాడేవారు కనుచూపు మేర లో కూడా కనిపించడం లేదు. మరోవైపు రివేంజ్ రాజకీయాలు లేవంటూనే కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది. జగన్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో తమను ఇబ్బంది పెట్టిన కీలక ప్రజాప్రతినిధులు, అధికారులను వెంటాడాలని ప్రయత్నిస్తోంది. దీంతో వారిలో ఒక రకమైన వణుకు కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు ముందస్తు బెయిల్ తెచ్చుకొని జాగ్రత్త పడ్డారు. తాజాగా మాజీ సీఎం జగన్ పై పంజా విసిరారు రఘురామకృష్ణంరాజు. తనను కస్టడీ తీసుకునే సమయంలో దాడి చేశారని ఆరోపిస్తూ ఏకంగా అప్పటి సీఎం జగన్ తో పాటు ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదు చేశారు. ఇలా ఫిర్యాదు చేశారో లేదో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసు బిగిసుకునే అవకాశాలు ఉన్నాయి.

2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు రఘురామకృష్ణంరాజు. గెలిచిన ఆరు నెలలకే పార్టీ నాయకత్వంతో విభేదించారు. రెబల్ గా మారిపోయారు. ఈ క్రమంలో విపక్షాలకు దగ్గరయ్యారు. ప్రతిరోజు వైసీపీ సర్కారును టార్గెట్ చేసుకునేవారు. దీంతో రఘురామకృష్ణం రాజు పై అనార్హత వేటు వేయాలని జగన్ ప్రయత్నించారు. కానీ వర్కౌట్ కాలేదు. ఈ తరుణంలో సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, వైసీపీ సర్కార్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ.. రఘురామకృష్ణం రాజు పై రాజ ద్రోహం కేసు నమోదయింది. ఆయన పుట్టినరోజు నాడే హైదరాబాదు వెళ్లి సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి తెలంగాణ ప్రభుత్వ సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు సిఐడి కార్యాలయానికి తెచ్చి విచారణ జరిపారు. ఆ సమయంలో సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, దాడి చేశారని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి కేసు నుంచి బయటపడ్డారు.

అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జగన్ తో పాటు తనపై అనుచితంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తాజాగా గుంటూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణంరాజు. వాస్తవానికి రఘురామకృష్ణంరాజు బిజెపి నుంచి నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేయాలని చూశారు. కానీ ఆయనకు టికెట్ దక్కకుండా జగన్ గట్టిగానే ప్రయత్నించారని రఘురామ ఆరోపించారు. వెంటనే చంద్రబాబు రంగంలోకి దిగి రఘురామకృష్ణంరాజును టిడిపిలోకి చేర్చుకున్నారు. ఉండి శాసనసభ టికెట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడిన రఘురామకృష్ణంరాజు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నాడు తన కస్టడీలో దాడి చేశారని ఆరోపిస్తూ గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఏ1 గా, మాజీ డిజీ పిఎస్సార్ ఆంజనేయులు ఎ2గా, సిఐడి ఏఎస్పీ విజయ్ పాల్ ఏ 4 గా, గుంటూరు జి జి హెచ్ మాజీ సూపర్డెంట్ డాక్టర్ ప్రభావతి ఏ 5 గా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, తప్పుడు నివేదికలు, భయభ్రాంతులకు గురి చేయడం, తదితర అంశాలకు సంబంధించిన పలు సెక్షన్లు పెట్టారు. వీటిలో బెయిల్ బుల్, నాన్ బెయిల్ బుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి.

గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు, పాలన వ్యవహారాలపై ఇప్పటికే రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ఇంకోవైపు జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో జరుగుతున్న జాప్యాన్ని నియంత్రించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పుడు తనపై సిఐడి కేసు నమోదు చేసిన నేపథ్యంలో జరిగిన దాడిని ప్రస్తావిస్తూ కేసు పెట్టారు. చంద్రబాబు వెనుక ఉండి ఇదంతా చేయిస్తున్నారని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఏపీలో రివేంజ్ రాజకీయాలు ఉండవంటూనే.. ఇలా చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అయితే ఇప్పుడు రఘురామకృష్ణం రాజును ప్రయోగించడం ద్వారా జగన్ పై ఉచ్చు బిగించాలని చంద్రబాబు చూస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version