Amaravathi Capital News: అమరావతి రాజధాని( Amaravathi capital) విషయంలో అన్ని సానుకూలతలే కనిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం సానుకూల నిర్ణయం చెప్పింది. ఇక అమరావతి రాజధానిని ఎవరు కదిలించలేరని సంకేతాలు అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఆది నుంచి బిజెపి స్టాండ్ అమరావతి. మధ్యలో పరోక్ష రాజకీయ స్నేహం చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానులు అన్నప్పుడు కూడా బిజెపి కేంద్రపరంగా అభ్యంతరం తెలపలేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం విషయంలో కేంద్ర పరంగా మౌనం దాల్చిందే తప్ప ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మరోవైపు అంతకుముందు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడంతో దానినే చెప్పుకొచ్చింది కేంద్రం గత ఐదేళ్లలో. అలాగని జగన్మోహన్ రెడ్డి సర్కార్ మూడు రాజధానులు అని చెప్పినా దానిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఇప్పుడు అమరావతిపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించి.. ఇకముందు రాజధాని విషయంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాన్ని చెక్ చెప్పనుంది కేంద్ర ప్రభుత్వం. అయితే జగన్ మూడు రాజధానులను బిజెపి దృష్టికి తీసుకెళ్లడమే కాదు.. ఆ ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు మాత్రం అమరావతికి భద్రత కేంద్రం ఇచ్చేలా ఏకంగా చట్టమే చేయబోతున్నారు.
అదే పనిగా దుష్ప్రచారం..
అమరావతి రైతులు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో చేసిన పోరాటం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తూ పోరాట బాట పట్టారు. ప్రజాస్వామ్య యుతంగా పోరాటం చేస్తున్న క్రమంలో అప్పటి వైసిపి ప్రభుత్వం వారిని ఇబ్బందులు పెట్టింది. రాష్ట్ర ప్రజల్లో ఒక రకమైన సానుభూతి కనిపించింది. రాజధాని లేకుండా చేసిన అపవాదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై పడడమే కాదు.. అమరావతి రైతులను ఇబ్బంది పెట్టడం కూడా మైనస్ గా మారింది. దాని పర్యవసానాలే 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ ఘోర ఓటమి. అయితే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతి విషయంలో లేనిపోని ప్రచారానికి దిగింది. ప్రజలను కూడా అయోమయంలో పడేసింది. దీనిపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారం తీసుకొని అమరావతికి ఇప్పుడు చట్టబద్ధత కల్పించనుంది.
అమరావతి రైతుల డిమాండ్ అదే..
ఇటీవల జరుగుతున్న పరిణామాలతో అమరావతి రైతులు ఆందోళన చెందారు. గత అనుభవాల దృష్ట్యా మరోసారి అమరావతిపై వివాదాలు రేగకుండా.. దానికి చట్టబద్ధత కల్పించాలని.. గెజిట్ నోటిఫికేషన్(Gezit notification ) జారీ చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై crda అధికారులు ఒక నివేదిక తయారు చేసి అటార్నీ జనరల్ కు నివేదించారు. అయితే అనేక రకాల అభ్యంతరాలు అక్కడ వ్యక్తం అయ్యాయి. గతంలో ఏ రాజధానికి గెజిట్ నోటిఫికేషన్ చేసిన దాఖలాలు లేవని తేల్చి చెప్పడంతో ఏపీ ప్రభుత్వం కలుగజేసుకుంది. ఏపీలో అమరావతి రాజధాని విషయంలో జరుగుతున్న అయోమయం పై కేంద్రం కలుగజేసుకోకపోతే మున్ముందు ఇబ్బందులు తప్పవని వివరించింది. ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని కోరింది. దీంతో పునర్విభజన చట్ట సవరణ చేసి.. గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది కేంద్రం. కేంద్ర న్యాయ సేకరించి ఆ గెజిట్ నోటిఫికేషన్ నివేదిక ఆమోదం ముద్రపడి క్యాబినెట్ ముందుకు వెళ్ళింది. క్యాబినెట్ ఆమోదించిన మరుక్షణం పార్లమెంట్లో పెట్టి చర్చించుకున్నారు. అమరావతికి నేరుగా గెజిట్ నోటిఫికేషన్ తో పాటు చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ఒక ప్రకటన చేయనుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇకనుంచి అమరావతిని కదిలించేందుకు ఎవరికి వీలుపడనంతగా రక్షణ కవచం రానుంది.
చంద్రబాబు చొరవతోనే..
అయితే 2014 నుంచి 2019 మధ్య పాలించిన చంద్రబాబు( CM Chandrababu) అప్పటి కేంద్రంతో సఖ్యతగా ఉండేవారు. ఎన్డీఏ లో కీలక భాగస్వామి కూడా. అయినా సరే అప్పట్లో అమరావతికి చట్టబద్ధత దక్కించుకోలేకపోయారు. 2019 నుంచి 2024 మధ్యపాలించిన జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే దానికి కూడా చట్టబద్ధత పొందలేకపోయారు. కనీసం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రానికి చెప్పలేకపోయారు. కానీ ఈసారి కేంద్రంలో తెలుగుదేశం కీలక భాగస్వామి కావడంతో చంద్రబాబు అడిగిందే తరువాయి అమరావతికి చట్టబద్ధత కల్పించింది కేంద్రం. ఇది ముమ్మాటికి చంద్రబాబు సాధించిన విజయం.